ఐపీఎల్లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు సంపాదించడానికి ప్రయత్నిస్తానని లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు. రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రవి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గతేడాది తనని సెలక్టర్లు టీమిండియా నుంచి తప్పించడానికి గల కారణాలు ఇప్పటికీ తెలియట్లేదని రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు.
2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు రవి బిష్ణోయ్ను సెలక్టర్లు పక్కనపెట్టారు. అయితే సెలక్టర్లు వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకున్నప్పటికీ టీ20 జట్టులో తనకి చోటు దక్కాల్సిందని బిష్ణోయ్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఇటీవల భారత జట్టులో చోటు దక్కించుకున్న సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ సిరీస్ల్లో సత్తాచాటాడు. ఓ సందర్భంలో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ర్యాంక్కు చేరుకున్నాడు. అయినప్పటికీ జట్టులో ఉన్న విపరీతమైన పోటీతో అతడి స్థానంపై గ్యారెంటీ లేదు.

''నన్ను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాలు నాకు తెలియదు. ఈ విషయంలో నేను కుంగిపోకుండా నా కోచ్లు ప్రద్యోత్ సింగ్ రాథోర్, షారుక్ ఖాన్ ఇద్దరూ అండగా నిలిచారు. సరైన దిశలో పయనించేలా చేశారు. ఐపీఎల్లో అయినా, దేశవాళీ క్రికెట్లో అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి నా స్థానంపై నాకు అభద్రతా భావం లేకపోవడం కాస్త సంతోషకరం. బౌలింగ్పై శ్రద్ధ వహిస్తూనే బ్యాటింగ్ కూడా సాధన చేస్తున్నా. ఎక్కువగా బౌలింగ్ చేస్తే ఆటలో మరింత మెరుగవుతామనే సిద్ధాంతాన్ని నమ్ముతా'' అని రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు.
భారత అండర్-19 జట్టులో తన సహచరులు యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ సత్తాచాటడం ఆనందంగా ఉందని రవి బిష్ణోయ్ తెలిపాడు. యశస్వీని చూస్తుంటే టెస్టు క్రికెట్ ఆడాలనే ప్రేరణ కలుగుతుందని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు గురించి స్పందిస్తూ.. ''ప్రపంచకప్ జట్టులో ఉండటానికి ఎవరు ఇష్టపడరు? అది నా కల. ఐపీఎల్లో మంచి ప్రదర్శన ఎంపిక అవ్వడానికి సాయపడుతుంది'' అని రవి బిష్ణోయ్ అన్నాడు.