మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా ఆక్షన్ కోసం ఇప్పటికీ ఫ్రాంచైజీలన్ని తమ పనులు మొదలుపెట్టాయి. వేలంలో ఏ ఆటగాడిని సొంతం చేసుకోవాలో, అతనిపై ఎంతవరకు రూ.కోట్లు కుమ్మరించాలో ఓ అంచనాకు వస్తున్నాయి. మరోవైపు స్టార్ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలు వదిలి వేలంలోకి బరిలోకి దిగుతున్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి.
అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ వేలంలోకి రాలేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడని క్రికెట్ అభిమానులకు తెలుసు. కానీ ఈ పరుగుల యంత్రం తొలి సీజన్కు ముందు కూడా ఐపీఎల్ వేలానికి రాలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లోనే ఆర్సీబీలోకి కోహ్లి యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్గా వచ్చాడు. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా కెప్టెన్గా యంగ్ కోహ్లికి ఆ సమయంలో విపరీతమైన క్రేజ్ ఉంది. వేలంలోకి వస్తే భారీ డిమాండ్ దక్కేది. అయితే అప్పటి నిబంధన ప్రకారం అండర్-19 కేటగిరి ఆటగాళ్లు వేలంలోకి రావడానికి వీళ్లేదు. ప్రీ-సీజన్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
బ్యాటర్గా సత్తాచాటడమే కాకుండా భారత యువ జట్టును గొప్పగా నడిపించిన కోహ్లిపై ఆర్సీబీ కన్నేసింది. అయితే ఢిల్లీకి చెందిన విరాట్ కోసం ఢిల్లీ డేర్డెవిల్స్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆర్సీబీ రూట్ క్లియర్ అయ్యింది. కోహ్లితో రాయల్ ఛాలెంజర్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ తర్వాత నుంచి కోహ్లిని ఆర్సీబీ వదిలిపెట్టలేదు. ప్రతి ఏటా రిటైన్ చేసుకుంటూ వస్తుంది. దీంతో కోహ్లి ఆ తర్వాత కూడా ఐపీఎల్ వేలంలోకి రాలేదు. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లి ఒక్కడినే రిటైన్ చేసుకుంది.
కాగా, ప్రస్తుతం కోహ్లికి ఆర్సీబీ రూ.15 కోట్లు చెల్లిస్తుంది. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 244 ఇన్నింగ్స్ల్లో 8004 పరుగులు చేశాడు. 38.67 సగటు, 131.97 సగటుతో పరుగుల వరద పారించాడు. ఎనిమిది సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు బాదాడు. గతేడాది 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.