
హైదరాబాద్: కాన్ఫూర్కు చెందిన ఓ ఛాయ్ వాలా తనకు "ప్రేరణ"గా నిలిచాడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బుధవారం తన ట్విట్టర్లో అతడిపై ప్రశసంల వర్షం కురిపించాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన మహ్మద్ మెహబూబ్ మాలిక్ టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ 40 మంది చిన్నారులను చదివిస్తున్నాడు.
తన ఆదాయంలో 80 శాతం మేర వారి విద్య కోసమే ఖర్చు చేస్తోండటం విశేషం. ఇదే విషయాన్ని లక్ష్మణ్ తన ట్విట్టర్లో "మహ్మద్ మెహబూబ్ మాలిక్... కాన్పూర్కు చెందిన ఛాయ్వాలా. ఓ చిన్న షాపు కలిగిన అతడు 40 మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. తన ఆదాయంలో 80 శాతం మేర వారి విద్య కోసమే ఖర్చు చేస్తున్నాడు. ఎంతో ప్రేరణ!" అని ట్వీట్ చేశాడు.
న్యూస్ వెబ్సైట్ హరిభూమి ప్రకారం మహ్మద్ మెహబూబ్ మాలిక్ కాన్పూర్లోని శారదా నగర్ ఏరియాలో నిరుపేద పిల్లల కోసం ఒక పాఠశాల నడుపుతున్నాడు. 2015లో ప్రారంభించిన ఈ పాఠశాల సుమారు 40 మంది పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. అంతేకాదు వారి యూనిఫాంలు, స్టేషనరీ, పుస్తకాలు మొదలైన వాటిని కూడా స్పాన్సర్ చేస్తున్నాడు.
దీంతో పాటు మా తుజే సలాం పేరిట ఫౌండేషన్ నెలకొల్పి అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్ చేసిన ఒక్క ట్వీట్తో అమాంతం వెలుగులోకి వచ్చాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. "నిజంగా ప్రేరణగా నిలిచాడు. ఆయన చేస్తున్న పనిలో కనీసం ఒక శాతం అయినా మనమందరం ప్రయత్నించాలి. మీరు గొప్ప ప్రేరణను పంచుకున్నారు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ అయితే "సార్... ఈ వ్యక్తి యొక్క చిరునామాను నాకు పంపండి, నేను అతనిని కలవాలనుకుంటున్నాను. అతడికి సహకరించాలనుకుంటున్నాను, నాకు సాధ్యమే! ప్రస్తుతం నేను కాన్పూర్కు అతి సమీపంలోని అలహాబాద్లో ఉన్నాను, నేను అతనిని సులభంగా చేరుకోగలను, నేను గూర్ఖాపూర్ నుండి వచ్చాను!" అంటూ ట్వీట్ చేశాడు.
"నాకు అతను తెలుసు, మా పక్క ఇంట్లో ఉంటాడు. నిజమైన దేశభక్తి కలిగిన వాడు. చిన్నతనంలో ఆతడితో కలిసి క్రికెట్ ఆడాను" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.