ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు వెల్లడైంది. ఈ నిర్ణయం వెనుక కారణం సోషల్ మీడియాకు సంబంధించినదిగా తేలింది.
భారత్కు వ్యతిరేకంగా మొహ్సిన్ నఖ్వీ అభ్యంతరకర పోస్టులు
నిజానికి టీమిండియా ఆటగాళ్లు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకపోవడానికి కారణం.. నఖ్వీ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా కొన్ని అభ్యంతరకరమైన పోస్టులను షేర్ చేయడమే. ఈ పోస్టుల్లో 'ఫైనల్ డే' అనే శీర్షికతో ఓ చిత్రం ఉంది. అందులో పాకిస్తాన్ ఆటగాళ్లు, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, పేసర్ షాహీన్ షా అఫ్రిది వంటి ఆటగాళ్లు ఫైటర్ జెట్ నేపథ్యంతో ఫ్లైట్ సూట్లలో కనిపించారు. ఈ చిత్రాన్ని చూసిన టీమిండియా ఇది కేవలం క్రీడా పోటీ కంటే, సైనిక శక్తి ప్రదర్శనగా భావించింది.

క్రిస్టియానో రొనాల్డో వీడియోను కూడా రీషేర్..
దీంతో పాటు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు, మొహ్సిన్ నఖ్వీ క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రొనాల్డో, హారిస్ రౌఫ్ చేసినట్లుగానే విమానం ప్రమాదానికి గురైనట్లు సైగ చేస్తుంటాడు. ఈ పోస్టులన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని భారత ఆటగాళ్లు, మేనేజ్మెంట్ భావించారు. మొహ్సిన్ నఖ్వీ వైఖరి ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ లాగా కాకుండా, భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న ఒక రాజకీయ వ్యక్తి లాగా ఉందని వారు భావించారు.
టీమిండియా కఠిన నిర్ణయం
క్రీడను రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీమిండియా స్పష్టం చేసింది. తాము మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అంగీకరిస్తే అది ఆయన రెచ్చగొట్టే, అనుచిత ప్రవర్తనకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ఆటగాళ్లు భావించారు. అందుకే నిరసన తెలియజేస్తూ వారు నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారు. ఈ సంఘటన భారత ఆటగాళ్లు క్రీడా మైదానంలోనే కాకుండా, బయట కూడా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని చూపిస్తుంది.