ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా అయిదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఆర్టీఎమ్ కార్డ్ నిబంధనను ఈసారి కూడా తిరస్కరించిందని సమాచారం. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.
అయితే రూల్స్ దాదాపుగా ఖరారు కావడంతో ఆటగాళ్ల బదిలీలు, రిటెన్షన్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వాస్తవానికి సంబంధం లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన వదంతుల గురించి ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ ఘూటుగా స్పందించాడు. అసలేం జరిగిందంటే..

'' తన మేనేజర్ ద్వారా ఈ వారం ప్రారంభంలో ఆర్సీబీని పంత్ సంప్రదించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కెప్టెన్సీ స్థానం ఖాళీగా ఉండటంతో దాని కోసం ప్రయత్నించాడు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతన్ని తిరస్కరించింది. ఆర్సీబీలోకి పంత్ రావడాన్ని విరాట్ కోహ్లి వ్యతిరేకించాడు. భారత జట్టులో, ఢిల్లీ క్యాపిటల్స్లో తన రాజకీయ వ్యూహాలను చూసి కోహ్లి వద్దన్నాడు- ఆర్సీబీ వర్గాల సమాచారం'' అని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు.
దీనికి రిషభ్ పంత్ ఘూటుగా సమాధానమిచ్చాడు. ''ఇది ఫేక్ న్యూస్. సోషల్ మీడియా వేదికగా ఎందుకు తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నారు? కాస్త సెన్సిబుల్గా ఉండండి. ఇది బాగోలేదు. ఎలాంటి కారణం లేకుండా అభద్రత వాతావరణాన్ని సృష్టించవద్దు. ఇలాంటివి ప్రచారం జరగడం ఇదేం ప్రథమం కాదు, అలా అని చివరిసారి కూడా కాదు. కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. సంబంధిత వర్గాల సమాచారాన్ని మరోసారి చెక్ చేయండి
''రోజురోజుకు ఇది మరింత దిగజారుతోంది. ఇక మిగిలింది మీ చేతుల్లో ఉంది. ఇది కేవలం మీకు మాత్రమే చెప్పట్లేదు. మీ తరహాలోనే తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న అందరికి చెబుతున్నాను'' అని రిషభ్ పంత్ రిప్లై ఇచ్చాడు. అయితే దీనికి సదరు ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. పంత్ పంజాబ్ కింగ్స్కు వెళ్తున్నాడని ఓ పెద్ద జర్నలిస్ట్ పోడ్కాస్ట్లో చెప్పారు, మీరు ఆయనకు కూడా ఓ రోజు బదులివ్వండి అంటూ రిప్లై ఇచ్చాడు.