మోడ్రన్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి అతన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది. ఇక వన్డేలు, టెస్టులు ఆడుతున్న అతనికి ఇటీవలే పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ కీలక సలహా ఇచ్చాడు. కోహ్లీ ఇకపై వన్డేలు కూడా వదిలేసి, కేవలం టెస్టులపై ఫోకస్ పెడితే మంచిదని సూచించాడు.
దీనికి టీమిండియా మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అక్తర్ సలహాతో గంగూలీ ఏకీభవించలేదు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్కు కూడా కోహ్లీ వీడ్కోలు పలకాలని అక్తర్ అన్నాడు. అప్పుడే సచిన్ పేరిట ఉన్న వంద సెంచరీల రికార్డు బద్దలు కొట్టగలుగుతాడని చెప్పాడు.

కానీ గంగూలీ మాత్రం దీనికి అంగీకరించలేదు. కోహ్లీ ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ఆడుకోవాలని చెప్పాడు. 'ఈ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వన్డేలు ఆడటం కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. టీ20ల్లో కోహ్లీని చూస్తే అవి అతనికి ఎంత భారంగా మారాయో స్పష్టంగా కనిపిస్తుంది' అని అక్తర్ వివరించాడు.
'కోహ్లీ మరో ఆరేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి. అప్పుడే సచిన్ వంద శతకాల రికార్డు బద్దలు కొడతాడు. ఆ సత్తా కోహ్లీకి ఉంది. అందుకే ఈ వరల్డ్ కప్ తర్వాత టెస్టులపై అతను ఫోకస్ పెట్టాలి' అని అక్తర్ సూచించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నను గంగూలీని అడిగారు. దీనికి బదులిచ్చిన దాదా.. ససేమిరా అన్నాడు.
కోహ్లీ మిగతా ఫార్మాట్లు ఎందుకు వదిలేయాలని ప్రశ్నించాడు. ఇలా వన్డేలకు కూడా వీడ్కోలు పలకాలని కొందరు అంటున్నారని చెప్పగా.. 'ఎందుకు? కోహ్లీ ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ఆడొచ్చు. ఎందుకంటే అతను అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు' అని గంగూలీ తేల్చిచెప్పాడు.