Rishabh Pant:భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్ (2025)లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. లక్నో జట్టు పంత్ను ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే,కోట్లకు పడగలెత్తిన ఈ యువ ఆటగాడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.అతని అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఇంతకీ రిషభ్ పంత్ తీసుకున్న నిర్ణయమేంటి.. అతని ఫ్యాన్స్కు ఆగ్రహం ఎందుకు తెప్పించింది..?
ఖరీదైన వీడియోలు, ప్రశ్నలు
సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రిషభ్ పంత్.. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తాజాగా ఒక మార్పు చేశాడు. ఇకపై తన ఎక్స్క్లూజివ్ వీడియోలు చూడాలన్నా, నేరుగా ప్రశ్నలు అడగాలన్నా అభిమానులు డబ్బులు చెల్లించాల్సిందేనని ఆ మార్పు సారాంశం. ఇందుకోసం నెలకు రూ. 390 చెల్లించాలని పంత్ నిర్ణయించాడు. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ను తీసుకొచ్చిన తర్వాత పంత్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.ఇప్పటి వరకు ఎంతో అమితంగా పంత్ను ప్రేమించిన అభిమానులు పంత్ ఇన్స్టా అకౌంట్ను అన్ఫాలో చేస్తుండగా కొందరు మాత్రం ఏముందిలే రూ.390యే కదా అంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంకొందరైతే అన్ని కోట్లు సంపాదించావ్ ఏంటా కక్కుర్తి అంటూ పోస్టులు పెడుతున్నారు.

కోట్లకు పడగలెత్తి.. ఇన్స్టాగ్రామ్లోనూ సంపాదన దేనికి?
పంత్కు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా కోటి 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, అతని ఎక్స్క్లూజివ్ కంటెంట్ను చూడటానికి ఇప్పటివరకు కేవలం 220 మంది మాత్రమే డబ్బులు చెల్లించడం గమనార్హం. ఇది అభిమానుల్లో నెలకొన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది.
'అభిమానులతో మాట్లాడటానికి కూడా డబ్బులు సంపాదించాలా?' అని పంత్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు. 'ఇప్పటికే కోట్లలో సంపాదిస్తున్నావు, మరి ఇన్స్టాగ్రామ్లో కూడా డబ్బుల కోసం ఎందుకు ఆశ పడుతున్నావు?' అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే, 'ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో డబ్బులు వసూలు చేసేది మహిళలు మాత్రమే, నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు?' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం పంత్ పట్ల అభిమానులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.