న్యూఢిల్లీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో పాకిస్థాన్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ వేదికలపై భారత్తో జరిగే మ్యాచుల్లో పాక్ ఎప్పటికీ గెలవదా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.
విరాట్ కోహ్లీ అద్భుత రీతిలో చేసిన 55 పరుగులు సంఖ్య పరంగా పెద్దమొత్తం కాకపోయినా, జట్టు విజయానికి కారణమైంది. ఈ మ్యాచ్తో 11 ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా చేతిలో పాక్ ఓడిపోయినట్లయింది. ఇక భారత్ విజయాన్ని మాజీ క్రికెటర్లు సంగక్కార, గవాస్కర్ సమీక్షించారు.
'ఓ పెద్ద టోర్నమెంటును భారత జట్టు ఎంతో నియంత్రణతో ఆడింది. ఆటగాళ్లను జట్టు మేనేజ్ మెంటు నమ్మింది. ఆ జట్టు ఎంతో నమ్మకంగా కనిపించింది' అని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేర్కొన్నాడు.

'ఇక పాక్ జట్టు విషయానికి వస్తే, వారు ఎంతో వివాదం తర్వాత పోటీలకు వచ్చారు. టీం సెలక్షన్లోనూ వివాదాలు నెలకొన్నాయి. మేనేజ్మెంటూ అలానే ఉంది. ఇన్ని సమస్యల మధ్య భారత్ వంటి జట్టును గెలవడం ఎంతో కష్టం' అని సంగక్కర వ్యాఖ్యానించాడు.
"పాక్ తో పోలిస్తే, భారత జట్టు బాగా ఆడింది. పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ అంతమాత్రం స్కోరును సాధించకుంటే, 100 పరుగులు కూడా జమ అయ్యేవి కాదు' అని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపాడు.
'ఇక పాక్ తో వరల్డ్ కప్ పోటీ అంటే, సాధారణంగానే భారత ఆటగాళ్లు ఇంకాస్త ఎక్కువ కష్టపడతారు. జట్టులో సీనియర్లు ఉన్నా లేకపోయినా కూడా. శనివారం నాటి మ్యాచ్లో పాక్ ఆ పని చేయలేకపోయింది' అని గవాస్కర్ చెప్పాడు.
ఒత్తిడే ముంచింది: కపిల్
ఒత్తిడే పాకిస్థాన్ ఓటమికి కారణమైందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. తన అనుభవం ప్రకారం ఇలాంటి పిచ్లపై బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురు దాడి చేయడమే బ్యాట్స్మెన్కు ఉన్న అత్యున్నత మార్గమని అన్నారు.
సహజశైలికి భిన్నంగా పరిస్థితులను ఆకళింపు చేసుకొని ఆడటం ముఖ్యమన్నాడు. విరాట్, యువరాజ్ చేసింది కూడా ఇదేనని తెలిపాడు. వాస్తవానికి యువరాజ్ చేసిన స్కోర్ను పక్కన పెడితే.. అతనో చెత్తషాట్కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడనే చెప్పాలి. ఏదేమైనా వీరిద్దరి సమయోచిత ఇన్నింగ్స్తోనే భారత్ టోర్నీలో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చని కపిల్ దేవ్ తెలిపాడు.