దాదా, మహీ సేవలపై సర్వే:
మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, గ్రేమ్ స్మిత్లతో కలిసి సంగక్కర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా భారత జట్టుకు ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ అందించిన సేవలపై ఓ సర్వే నిర్వహించారు. జూలై 7, 8 తేదీల్లో వరుసగా పుట్టిన రోజు జరుపుకున్న వీరిద్దరి బ్యాటింగ్, కెప్టెన్సీ తదితర అంశాలపై ఈ సర్వేలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గంగూలీపై ధోనీకి అతి స్వల్ప మెజారిటీ వచ్చింది. దీనిపై సంగక్కర తన అభిప్రాయం వెల్లడించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ బెస్ట్:
కుమార సంగక్కర మాట్లాడుతూ... 'గంగూలీకీ ధోనీ ఎప్పటికీ పోటీకాదు. ధోనీ కేవలం జట్టును ముందుకు నడిపించాడు. అయితే అతడికి పటిష్ఠమైన జట్టును అందించింది మాత్రం గంగూలీనే. ధోనీ బ్యాట్సమన్, కెప్టెన్గా ఎంతో కష్టపడ్డాడు. ఎలప్పుడూ జట్టును గెలిపించాలనే తపన ధోనీలో కనిపిస్తుంది. కానీ గంగూలీ మాత్రం యువతను ప్రోత్సహిస్తూ.. తన తరువాత వారికి ఓ మంచి జట్టును అందించేందుకు ఎంతగానో శ్రమించాడు. వన్డే క్రికెట్లో ఫినిషర్ పాత్ర చాలా కఠినమైనది. మహీ మాత్రం అద్భుతంగా ఆడుతాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దాదా బదులు మహీనే ఎంచుకుంటా. టెస్ట్ క్రికెట్లో మాత్రం దాదానే బెస్ట్' అని అన్నాడు.
అతిపెద్ద తేడా అదే:
'దాదా, మహీ కెప్టెన్సీలో ఉన్న అతిపెద్ద తేడా ధోనీనే. అతనిలాంటి మిడిలార్డ్ బ్యాట్స్మన్, ప్రశాంతంగా మ్యాచ్ను ముగించే ఫినిషర్, ఎలాంటి పరిస్థితులోనైనా జట్టును గెలిపించే ఆటగాడు ఉంటే విజయాలు వాటంతటే అవే వచ్చి చేరుతాయి. నా వరకు వాళ్ల కెప్టెన్సీలో ఉన్న తేడా అదే' అని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. 'ఒక వేళ ధోనీ వంటి ఆటగాడు దాదా జట్టులో ఉండి ఉంటే అతను మరింత సక్సెస్ సాధించేవాడు. మరిన్నీ ట్రోఫీలు అందుకునేవాడు. ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో దాదా జట్టును నడిపించాడు. ఆ సమయంలో ఆసీస్ ప్రపంచ క్రికెట్ను శాసించిందనే చెప్పాలి. ధోనీ లాంటి ఫినిషర్ ఉంటే దాదా ఆసీస్ను అడ్డుకునేవాడు' అని ఈ సౌతాఫ్రికా లెజెండ్ తెలిపాడు.
గంగూలీపై ధోనీ విజయం:
తాజాగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. టెస్టుల్లో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్వదేశీ, విదేశీ రికార్డులు.. వన్డేల్లో వారు సాధించిన ఘనతలు.. కెప్టెన్గా ఉన్న సమయంలో వారు చేసిన పరుగులు.. జట్టుపై వారి కెప్టెన్సీ ప్రభావం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని స్టార్ స్పోర్ట్స్ సర్వేని నిర్వహించింది. సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు పాల్గొనగా.. జ్యూరీలో జర్నలిస్ట్లు, మాజీ క్రికెటర్లు, బ్రాడ్కాస్టర్స్కి అవకాశం కల్పించారు. సర్వేలో ధోనీ 0.4 తేడాతో గంగూలీపై విజయం సాధించాడు.