
జడ్డూ అవుటైన తర్వాత కూడా..
నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే అనవసరమైన షాట్కు ప్రయత్నించిన జడేజా అవుటయ్యాడు. మిడాన్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించిన అతను అక్కడ ఉన్న ఖవాజాకు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత అయ్యర్ బ్యాటింగ్కు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ భరత్ వచ్చాడు. ఇది ఎందుకో అర్థం కాలేదు. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు అసలు విషయం చెప్పాయి. మూడో రోజు చివర్లో తనకు వెన్నునొప్పిగా ఉందని అయ్యర్ చెప్పాడట. దీంతో అతన్ని స్కానింగ్ల కోసం ఆస్పత్రికి తరలించారట. ఈ కారణంగానే ముందు జడ్డూను, తర్వాత భరత్ను బ్యాటింగ్కు పంపించారని తెలుస్తోంది.

రాణించిన భరత్..
ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న కోన భరత్ చక్కని షాట్లు ఆడాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కూడా బాదాడు. దీంతో అతను కూడా భారీ స్కోరు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ లియాన్ బౌలింగ్లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. దాన్ని షార్ట్ లెగ్లో ఉన్న హాండ్స్కోంబ్ సులభంగా పట్టేశాడు. దీంతో భరత్ ఇన్నింగ్స్ ముగిసింది. అతను అవుటైన తర్వాత అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. అయ్యర్ మాత్రం రాకపోవడంతో ఈ గాయం తీవ్రమైందా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

సిరీస్ ముందు కూడా..
కాగా, అయ్యర్ ఈ వెన్నునొప్పి కారణంగానే ఈ సిరీస్లో తొలి టెస్టుకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ జట్టుతో చేరిన అతను ఢిల్లీ, ఇండోర్ టెస్టుల్లో ఆడినా సత్తా చాటలేకపోయాడు. అంతకుముందు న్యూజిల్యాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీసులో కూడా అయ్యర్ ఆడాల్సింది. కానీ ఈ వెన్ను నొప్పి కారణంతోనే ఈ సిరీస్కు అతను దూరమయ్యాడు. అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్కు స్క్వాడ్లో చోటు దక్కింది. అయితే అతనికి ఈ సిరీస్లో ఆడే ఛాన్స్ మాత్రం దక్కలేదు.


Click it and Unblock the Notifications












