లాహోర్: ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఇంగ్లండ్లోని మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కకావికలం చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలు కావడంపై స్వదేశంలోనూ నిప్పులు చెరుగుతున్నారు అభిమానులు. కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మొదలుకుని, జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఇంజమామ్-ఉల్-హక్ వరకు ఎవరూ ఈ విమర్శల నుంచి తప్పించుకోవట్లేదు. క్రికెట్ ప్రియులతో పాటు పాకిస్తాన్ మాజీ కేప్టెన్లు, ఆటగాళ్లు సైతం జట్టు ఆటతీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పాటుఇంగ్లండ్లో ఉండటంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై జట్టు మాజీ కేప్టెన్ ఇంతికాబ్ ఆలమ్ విమర్శలు సంధించారు. చీఫ్ సెలెక్టర్కు జట్టుతో పాట ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అయినా తమ జట్టుతో పాటు ఇంగ్లండ్కు వెళ్లారా? అని నిలదీశారు. ఒక్కసారి జట్టును ఎంపిక చేయడంతోనే చీఫ్ సెలెక్టర్ విధులు పూర్తవుతాయని గుర్తు చేశారు. ఆ తరువాత కోచ్, కేప్టెన్.. మిగిలిన విషయాలను చూసుకుంటారని, అలాంటప్పుడు చీఫ్ సెలెక్టర్కు అక్కడేం పనేముంటుందని చెప్పారు.
భారత్తో మ్యాచ్కు ముందు రోజు రాత్రి జట్టు సభ్యులు మాంఛెస్టర్లోని 360 శీషా రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటిపోయేంత వరకూ గడిపిన విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఇంతికాబ్ ఆలమ్ డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరుసటి రోజు కీలకమైన మ్యాచ్ ఉన్నప్పటికీ.. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆలమ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరారు.