దాదాపు నెలన్నర రోజులు తర్వాత భారత జట్టు బరిలోకి దిగింది. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో తొలి టెస్టు గురువారం నుంచి ఆడుతోంది. సుమారు ఆరు నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా... వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. స్పిన్కు స్వర్గధామంగా భావించే చెపాక్ పిచ్పై భారత్ ముగ్గురు పేసర్లతో ఆడుతోంది.
సాధారణంగా భారత్లో స్పిన్లర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. మన వికెట్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక చెపాక్ వేదిక మిగిలిన మైదానాల కంటే కాస్త ఎక్కువగా స్పిన్కు అనుకూలిస్తోంది. దీంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బంగ్లాతో తొలి టెస్టు ఆడతుందని భావించారంతా. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లలో ఎవరికి అవకాశం దక్కుతుందని చర్చ పెద్దఎత్తున సాగింది.

కానీ భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జడేజా, అశ్విన్ తుదిజట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా వ్యూహంపై చర్చ మొదలైంది. అయితే ఈ ఏడాది ఆఖర్లో ఉన్న ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధంగా భారత్ ఈ ప్రణాళిక రచించిందని తెలుస్తోంది. ఆసీస్ వికెట్లు సీమర్లకు అనుకూలిస్తాయనే విషయం తెలిసిందే.
అందుకే పిచ్ను కూడా కాస్త సీమ్కు అనూకూలంగా సిద్ధం చేశారు. టాస్కు ముందు పిచ్ను పరిశీలించిన మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇలా వ్యాఖ్యానించాడు. ''ఎర్రమట్టి పిచ్పై ఈ మ్యాచ్ జరగుతుంది. ఈ వికెట్ నుంచి బౌన్స్, టర్న్ రాబట్టవచ్చు. స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పిచ్ కింద కాస్త తేమ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్లు సత్తాచాటతారు'' అని అన్నాడు.
దానికి తగ్గట్లుగానే మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ పది ఓవర్ల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. హసన్ మహ్మద్ నిప్పులు చెరిగే బంతులతో మూడు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్), శుభ్మన్ గిల్ (డకౌట్), విరాట్ కోహ్లి (6; 6 బంతుల్లో)ని ఔట్ చేశాడు. అయితే భారత్ వ్యూహానికి మరో రెండు కారణాలు ఉన్నాయిని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మన ఫాస్ట్ బౌలర్లను పరీక్షించుకోవడానికి పిచ్ను ఇలా సిద్ధం చేశారని తెలుస్తోంది. అంతేగాక బంగ్లాదేశ్కు ప్రధానంగా స్పిన్ బలమని భావించి ఈ నిర్ణయ తీసుకున్నారని మరో వాదన. పాకిస్థాన్పై టెస్టు సిరీస్ గెలవడంలో బంగ్లా స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆట కొనసాగే కొద్ది పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది.