
లండన్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ను తప్పించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు. తొలి టెస్టులో కోహ్లీ మినహా టాపార్డర్ బ్యాట్స్మెన్ అందరూ విఫలమైనా రెండో టెస్టులో ధావన్ని తుది జట్టు నుంచి తప్పించడం భావ్యం కాదని తెలిపాడు.
"బర్మింగ్హామ్ టెస్టులో కోహ్లీ మినహా టాపార్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిలయ్యారు. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్తో పోలిస్తే శిఖర్ ధావన్ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. అతని ఫుట్వర్క్ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. లార్డ్స్ టెస్టు నుంచి అతడిని తప్పించారు. దానికి కారణంగా.. అతను ఔటైన తీరుని చూపిస్తున్నారు" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
"స్ట్రోక్ ప్లేయర్.. స్లిప్లో బంతిని తరలించే ప్రయత్నంలో కొన్ని సార్లు వికెట్ను చేజార్చుకోవచ్చు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలానే ఆడేవాడు. కానీ, వారికి ఆ షాట్లే బలం. విదేశీ గడ్డపై ధావన్తో పాటు టాప్ ఆర్డర్లోని కొంత మంది బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారు. వారి గణాంకాలే దానికి నిదర్శనం. అయితే, ఎందుకో ప్రతిసారీ ధావన్పైనే వేటు పడుతోంది" అని అన్నాడు.
తొలి టెస్టుకి ముందు జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ శిఖర్ ధావన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో 26, 13 పరుగులతో నిరాశపరిచాడు. ఆ టెస్టులో రెండు సార్లూ ఈ ఓపెనర్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇక, లార్డ్స్ టెస్టులో శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్గా వెళ్లిన కేఎల్ రాహుల్ (8) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. రెండు ఫోర్లు కొట్టి ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నట్లే కనిపించిన రాహుల్ కీపర్ బెయిర్స్టో చేతికి క్యాచ్ ఇచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పుజారా (1) కోహ్లీ తడబాటు కారణంగా రనౌటయ్యాడు.
లార్డ్స్ టెస్టులో కోహ్లీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. పలుమార్లు వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్లో 15 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), రహానే పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.