దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఐపీఎల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. దాని వల్ల ఆల్రౌండర్స్ జట్టులో చోటు కోల్పోతున్నారని అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తో జట్టులో 12 మంది అవుతున్నారని, ఆల్రౌండర్ ప్రాముఖ్యత తగ్గుతుందని చెప్పాడు.
అలాగే మితిమీరిన క్రికెట్ వల్ల కొత్త ఆల్రౌండర్స్ ఎక్కువగా రావట్లేదని ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమ్స్ అన్ని విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లతో పాటు ఫ్రాంచైజీ లీగ్స్ లో ప్లేయర్లు విరామం లేకుండా ఆడుతున్నారు. అయితే క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్రౌండర్స్ ఎక్కువగా కనపడరని, ప్రతిరోజూ రారని కలిస్ వివరించాడు.

కాగా, డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా, ఆఖరి టెస్టు కేప్ టౌన్ లో జరగనుంది. ఇప్పటివరకు సౌతాఫ్రికాలో టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ విజయం సాధించలేకపోయింది. దీని గురించి కలిస్ మాట్లాడుతూ.. టీమిండియా బలమైనే జట్టు అని, కానీ సౌతాఫ్రికాలో తమ జట్టును ఓడించలేదని అన్నాడు.
''ప్రస్తుత భారత జట్టు బలమైనదే. కానీ సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను ఓడించడం చాలా కష్టం. సెంచూరియన్ లో మా జట్టే ఫేవరేట్. కానీ కేప్ టౌన్ లో టీమిండియాకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుంది. ఒకటి, రెండు సెషన్స్ తేడాలో పైచేయి సాధించిన వారు విజయం సాధిస్తారు'' అని కలిస్ అన్నాడు.
సౌతాఫ్రికా తరపున కలిస్ 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. సుమారు 25వేల పరుగులు, 600 వికెట్లు సాధించాడు. ఇక టెస్టుల్లో 45 శతకాలు సాధించాడు. వన్డేల్లో 17 సెంచరీలు అందుకున్నాడు. గొప్ప ఆల్రౌండర్ గా జాక్వెస్ కలిస్ ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు.