
ఎందుకు డైవ్ చేయలేకపోయా?:
తాజాగా ప్రపంచకప్ రనౌట్పై ధోనీ స్పందించాడు. ఒక మీడియాతో మాట్లాడుతూ చాలా బాధపడ్డాడు. 'నేను ఆడిన తొలి మ్యాచ్లో రనౌట్ అయ్యా. మళ్లీ సెమీస్ మ్యాచ్లో అలానే రనౌట్ అయ్యాను. ఈ రెండు రనౌట్లపై ఇప్పటికీ బాధపడుతుంటా. ప్రపంచకప్లో ఎందుకు డైవ్ చేయలేకపోయా? అని ప్రశ్నించుకుంటా. ఆ రెండు ఇంచులను డైవ్ చేయాల్సిందని అనుకుంటా' అని ధోనీ పేర్కొన్నాడు.

ఏడో వికెట్కు 116 పరుగులు:
మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. ఒకానొక దశలో 92/6తో ఓటమి అంచున నిలిచిన జట్టును రవీంద్ర జడేజా (77), ధోనీ (50) జోడి ఆదుకున్నారు. ఇద్దరు ఏడో వికెట్కు 116 పరుగులు జోడించి విజయంపై నమ్మకం కలిగించారు. ఈ క్రమంలో జడేజా ఔటయ్యాడు.

ధోనీ రనౌట్:
జడేజా ఔటైనా.. మ్యాచ్ ఫినిషర్ ధోనీ క్రీజులో ఉండడంతో కోట్లాది మంది భారతీయుల ఆశలన్నీ విజయంపై అలానే ఉన్నాయి. చివరి రెండు ఓవర్లలో భారత్కు 31 పరుగులు అవసరం. లాకీ ఫెర్గుసన్ వేసిన 49వ ఓవర్లో ధోనీ తొలి బంతిని సిక్స్గా మలిచాడు. తర్వాతి బంతికి పరుగులు రాలేదు. దీంతో ఒత్తిడికి గురైన ధోనీ.. మూడో బంతికి రెండు పరుగులు తీయాలని భావించాడు. షాట్ ఆడిన మహీ రెండో పరుగు కోసం వెళుతుంటే.. మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. అనంతరం భారత్ 221 పరుగులకు ఆలౌటైంది.

ఆరు నెలలుగా క్రికెట్కు దూరం:
గతేడాది జూలై 10న సెమీస్ మ్యాచ్ ముగిశాకా దాదాపు ఆరు నెలలుగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కొంతకాలం పాటు భారత సైన్యంలో సేవలందించాడు. అనంతరం వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకల సిరీస్లకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్కూ ధోనీ దూరంగా ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు దూరం కానున్నాడు.

ఐపీఎల్లో ఫామ్ బాగుంటే:
తాజాగా భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ... 'ధోనీ త్వరలోనే వన్డే కెరీర్కు వీడ్కోలు పలుకనున్నాడు. టీ20లలో మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి.. ఫిట్నెస్, ఫామ్ బాగుంటే టీ20 ప్రపంచకప్కు ధోనీ ఎంపికయ్యే అవకాశాలున్నాయి' అని తెలిపాడు.


Click it and Unblock the Notifications
