ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో భాగంగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు దిగకపోవడం చర్చనీయాంశమైంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే భారత ఇన్నింగ్స్లో ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. కానీ ఈ మొత్తం ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాలేదు.
లోపల ఏం జరిగిందంటే?
భారత్ ఒమన్ తో జరిగే మ్యాచ్ కంటే ముందే సూపర్-4కు అర్హత సాధించింది. ఒమన్తో జరిగిన మ్యాచ్ ఒక లాంఛనం కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ను ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగించుకుంది. ఇందులో భాగంగానే కీలక ఆటగాళ్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా ఈ టోర్నమెంట్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాలేదని తెలుస్తోంది. ఈ నిర్ణయం జట్టులోని ఇతర ఆటగాళ్లకు కూడా కీలకమైన సూపర్-4కు ముందు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించింది.

మ్యాచ్ సాగిన తీరు ఇలా..
భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటర్లలో సంజు శాంసన్ (45 బంతుల్లో 56 పరుగులు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38 పరుగులు) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (26) కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, జితేన్ రమనాండి, ఆమీర్ కలీం చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఒమన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ బ్యాటర్లలో ఆమీర్ కలీం (64), హమ్మద్ మీర్జా (51) అర్ధసెంచరీలు సాధించి పోరాడినా విజయం దక్కలేదు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాకపోవడం వెనుక ఉన్న వ్యూహం, ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించడమే అని స్పష్టమవుతోంది.