కొలంబో: అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన కుమార సంగక్కరకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు స్వాగతం పలికారు.
"ఓ మహోన్నత క్రీడాకారుడా, మాజీ క్రికెటర్ల క్లబ్లోకి స్వాగతం" అంటూ స్వాగతం పలికారు. నీ జీవితంలో రెండో ఇన్నింగ్స్ కూడా మధురంగా సాగిపోవాలని ఆశిస్తున్నట్టు సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కుమార సంగక్కర వీడ్కోలు సమయంలో కొలంబోలోని పీ సారా ఓవెల్ మైదానంలో ఉన్న సునీల్ గవాస్కర్ ఓ సందేశాన్ని కవర్లో ఉంచి అందించారు.

"శ్రీలంక క్రికెట్ డ్రెస్సింగ్ రూంలో పెద్దన్నలా మెలిగావు. బంతి నీ బ్యాట్కు తగిలి, అది బౌండరీ దిశగా వెళుతున్నప్పుడు వచ్చే సౌండ్ను ఏ క్రికెట్ ప్రేమికుడూ, ఎప్పటికీ మర్చిపోలేడు" అని తన సందేశంలో పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ కూడా కుమార సంగక్కరకు ఓ ట్వీట్ ద్వారా స్వాగతం చెప్పారు.
"బాగా ఆడావు. ఆటకు నికార్సైన ప్రతినిధివి నువ్వు. అంతేగాదు, సిసలైన జెంటిల్మన్గా నిలిచావు. రిటైర్డ్ ఆటగాళ్ల క్లబ్లోకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం" అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.