రాజ్కోట్: ఛటేశ్వర పుజారా తన తండ్రి కోరిక మేరకు... తమ ప్రాంతంలోని క్రీడాకారుల కోసం ఆరు ఎకరాలు కొని, క్రికెట్ మైదానంగా తయారు చేయించాడు. సాధారణంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఆటగాళ్లు ఎక్కువగా తమ డబ్బును వ్యాపారాల్లో పెడుతుంటారు.
పుజారా మాత్రం కొంతమంది యువ క్రికెటర్ల కోసం వెచ్చిస్తున్నాడు. తన ప్రాంతంలోని కుర్రాళ్ల కోసం పుజారా ఆరు ఎకరాల స్థలం కొన్నాడు. అందులో క్రికెట్ పిచ్లను ఏర్పాటు చేశాడు. ఇందులో వారు ఉచితంగా ఆడుకోవచ్చు. తన స్వస్థలం రాజ్కోట్కు అయిదు కిలోమీటర్ల దూరంలో పేద క్రికెటర్ల కోసం దీనిని పుజారా కొన్నాడు.

ఈ మైదానంలో ఆరు పిచ్లు ఏర్పాటు చేశాడు. జిమ్ సహా పలు సదుపాయాలూ కల్పించాడు. అక్కడ సాధన చేసే పేద యువకులను వారి ఇంటి నుంచి తీసుకొచ్చి, మళ్లీ ఇంటిదగ్గర దింపడానికి వ్యాన్ కూడా ఏర్పాటు చేశాడు. వారి నుంచి పుజారా డబ్బులు ఏమీ తీసుకోవడం లేదు.
రాజ్కోట్లో యువకులు ఆడేందుకు సరైన మైదానం లేదని, ముంబైలో శివాజీ పార్క్, ఆజాదా మైదానం వంటివి ఉన్నాయని, రాజ్ కోట్లో మాత్రం లేవని, తనకు రైల్వే పిచ్ ఉపయోగపడిందని, ఇందుకు నేను లక్కీ అని, ఈ ప్రాంతం వారి కోసమే చేసినట్లు పుజారా చెబుతున్నాడు. మా ప్రాంతంలోని కుర్రాళ్లను ప్రోత్సహించేందుకేనని చెప్పాడు.