రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తయి వారాలు రోజులు గడుస్తున్నాయి. కానీ కొత్త కోచ్గా గంభీర్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన అనంతరం రాహుల్ ద్రవిడ్కు ఘనంగా వీడ్కోలు పలికి నయా కోచ్ గురించి ప్రకటిస్తారని భావించారంతా.
కానీ అలా కూడా జరగలేదు. విక్టరీ పరేడ్ ముగిసింది. మరోవైపు జింబాబ్వే పర్యటన కూడా ఈ ఆదివారంతో ముగుస్తుంది. తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, శుభ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేకు వెళ్లిన భారత యువ జట్టు కూడా మరో వారంలో స్వదేశానికి చేరుకుంటుంది. అంతేగాక ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ బీసీసీఐ మాత్రం కోచ్ను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ కొత్త కోచ్ ప్రకటన ఆలస్యం చేయడానికి కారణం జీతభత్యాల గురించే అని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. గౌతమ్ గంభీర్ భారీగా జీతాన్ని డిమాండ్ చేసినట్లు రాసుకొచ్చింది. రాహుల్ ద్రవిడ్ ఏడాదికి రూ.12 కోట్ల జీతాన్ని తీసుకున్నాడు. అంతకంటే ఎక్కువ మొత్తంలో గంభీర్ కోరినట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోచ్గా గంభీర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.
అప్పటి వరకు ఐపీఎల్ వంటి ఖరీదైన లీగుల్లో గంభీర్ ప్రాతినిథ్యం వహించడానికి కుదరదు. కేకేఆర్ మెంటార్ పదవికి కూడా గంభీర్ గుడ్ బై చెప్పేశాడు. ఈ లెక్కలన్నీ ఆలోచించి బీసీసీఐని గంభీర్ భారీగా జీతాన్ని డిమాండ్ చేశాడని నేషనల్ మీడియా పేర్కొంది. మెంటార్గా కేకేఆర్ గూటికి తిరిగొచ్చిన గంభీర్ ఆ ఫ్రాంచైజీ దశాబ్దపు కప్ కలను 2024లో నెరవేర్చాడు. దీంతో తమ ఫ్రాంచైజీలోనే గంభీర్ కొనసాగడానికి కేకేఆర్ భారీ మొత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది.