
అశ్విన్ విన్నింగ్ షాట్..
ఈ మ్యాచ్ అంతా ఒక ఎత్తయితే.. చివరి ఓవర్లో చోటు చేసుకున్న హైడ్రామా మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. భారత్కు ఘన విజయాన్ని అందించిన ఓవర్ అది. గెలవడానికి భారత్కు చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో పోరాడింది టీమిండియా. చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా విజయాన్ని ముద్దాడింది. చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడాడు. దీనితో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.

ఎక్స్ట్రాలపై..
బైస్ రూపంలో మూడు ఎక్స్ట్రా పరుగులు రావడం, ఫ్రీ హిట్ దక్కడం వంటి పరిణామాలు టీమిండియాను విజయానికి మరింత చేరువ చేశాయి. నవాజ్ సంధించిన చివరి ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది ఫ్రీ హిట్ కావడంతో అతను పెవిలియన్కు వెళ్లలేదు. స్టంప్స్కు తగిలిన తరువాత కోహ్లీ, దినేష్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. అవన్నీ బైస్ రూపంలో లభించాయి. స్టంప్స్ను గాల్లోకి లేపి థర్డ్ మ్యాన్ దిశగా దూసుకెళ్లిన బంతిని ఫీల్డర్ త్రో చేశాడు. ఈ లోగా టీమిండియా స్కోర్ బోర్డ్పై మూడు పరుగులు జమ అయ్యాయి.

బాబర్ గుస్సా..
ఫ్రీ హిట్లో మూడు పరుగులు సాధించడాన్ని పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ తప్పుపట్టాడు. దాన్ని డెడ్ బాల్గా పరిగణించాలని డిమాండ్ చేశాడు. అంపైర్తో గొడవకు దిగాడు. ఫ్రీ హిట్గా వెలువడిన బంతి స్టంప్స్ను తాకినందున దాన్ని డెడ్ బాల్గా పరిగణించాలని అంపైర్కు చెప్పాడు. డెడ్ బాల్కు పరుగులు ఎలా తీస్తాడని ప్రశ్నించాడు. తోటి ప్లేయర్లు కూడా అతనితో కలవడంతో గ్రౌండ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కొద్దిసేపు.

నిబంధనలకు లోబడే..
మెరీలైబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ యాక్ట్ ప్రకారం బౌలర్ చేతి నుంచి వెలువడిన బంతి నేరుగా వికెట్ కీపర్ లేదా బౌలర్కు క్యాచ్ వెళ్లినా లేదా బౌండరీ దాటినప్పుడు మాత్రమే డెడ్ బాల్గా పరిగణిస్తారు. బ్యాటర్ ఔట్ అయినప్పుడు బంతిని డెడ్ బాల్ అని కూడా పిలుస్తారు. క్రికెట్ యాక్ట్ రూల్ ఆఫ్ లా 20.1.1 ప్రకారం- దీనిపై అంపైర్కు నిర్ణయాధికారం ఉంటుంది. బంతిని డెడ్గా ప్రకటించాలా? వద్దా? అనేది అంపైర్ తీసుకునే తుది నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

అలాంటి సందర్భాల్లోనే..
ఫ్రీ హిట్ రూపంలో వెలువడిన బంతిని ఆడే క్రమంలో బ్యాటర్ హిట్ వికెట్ అయినా దాన్ని డెడ్ బాల్గా పరిగణించవచ్చు. ఫ్రీ హిట్లో బాల్ను చేత్తో పట్టుకోవడం, బంతిని రెండుసార్లు కొట్టడం, ఫీల్డర్ను అడ్డుకోవడం, రనౌట్ చేయడం వంటి నాలుగు సందర్భాల్లో మాత్రమే బ్యాటర్ అవుట్ అయినట్టు పరిగణిస్తారు. అవేవీ కారణం కానందున దాన్ని డెడ్ బాల్గా పరిగణించలేదు అంపైర్లు. భారత్కు బైస్ రూపంలో మూడు పరుగులొచ్చాయి.


Click it and Unblock the Notifications
