స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై భారత దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్స్పై విరాట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండిపడ్డాడు. కోహ్లి ఆటతీరును బట్టే వ్యాఖ్యానిస్తామని, తమకంటూ ప్రత్యేక ఎజెండాలేమి ఉండవని అన్నాడు. ఓపెనర్గా వచ్చి 15వ ఓవర్ వరకు క్రీజులో ఉండి 118 స్ట్రైక్రేటుతో ఆడితే, దాన్ని స్లో ఇన్నింగ్స్ అనే అంటారని గవాస్కర్ తెలిపాడు.
ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి (51; 43 బంతుల్లో) ఆడిన ఇన్నింగ్స్పై సునీల్ గవాస్కర్తో సహా కొందరు మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ విమర్శించాడు. మరికొందరు మాజీలు పవర్ప్లే అనంతరం కోహ్లి హిట్టింగ్ చేయలేకపోతున్నాడని అన్నారు.

ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో కోహ్లి తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ వేశాడు.''చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్రేటు గురించి, స్పిన్లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో.. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్లో కూర్చొని మాట్లాడటం సరికాదు'' అని కోహ్లి కాస్త ఘూటుగా బదులిచ్చాడు.
దీనిపై గవాస్కర్ స్పందించాడు. ''కోహ్లి స్ట్రైక్రేటు 118 పైనే కామెంటేటర్స్ ప్రశ్నించారు. అయితే అందరూ అదే అన్నారని చెప్పలేను. నేను ఎక్కువగా మ్యాచ్లు చూడను. కాబట్టి ఇతర వ్యాఖ్యాతలు ఏమన్నారో తెలియదు. కానీ ఓపెనర్గా వచ్చి, 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి, 118 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేస్తే పొగడ్తలు ఉండవు. దానికి ప్రశంసలు దక్కాలనుకుంటే భిన్నంగా ఉంటుంది''
''బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోమని ఈ ఆటగాళ్లంతా చెబుతుంటారు. అలా అయితే విమర్శలకు ఎందుకు బదులిస్తున్నారు? మేం కొంచెమే క్రికెట్ ఆడాం, ఎక్కువగా ఆడలేదు. కానీ మాకెలాంటి ఎజెండాలు లేవు. మేం చూసే దాని గురించే మాట్లాడతాం. మాకు ఇష్టాలు, అయిష్టాలు ఉండవు. అలా ఉన్నప్పటికీ ఆట గురించే విశ్లేషిస్తాం'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.