ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వాస్తవానికి లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఆడింది. అయితే ఈ మ్యాచులో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు.. వచ్చి రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను పడగొట్టి ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. అతడే విఘ్నేశ్ పుత్తూర్.
ధోనీ ప్రశంసలు..
ఈ లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్నర్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మరో కీలక వికెట్ శివమ్ దూబెను కూడా ఔట్ చేశాడు. అనంతరం దీపిక్ హూడాను కూడా పెవిలియన్ పంపాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సీఎస్కే స్టార్ బ్యాటర్ కూడా.. అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి మరి అభినందించాడు. దిగ్గజ క్రికెటర్ అతడిని అభినందించడం, పైగా మ్యాచులో కీలక వికెట్లు తీయడంతో.. విఘ్నేశ్ పుత్తూర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అతడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బేస్ ప్రైజ్ ధరకు..
24 ఏళ్ల విఘ్నేశ్ పుత్తూర్.. లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్నర్. కేరళలోని మలప్పురమ్ కు చెందినవాడు. ఈ యంగ్స్టర్ను ముంబయి జట్టు బేస్ ప్రైజ్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. అయితే ఇతడు కేరళ తరఫున సీనియర్ లెవల్ లో ఆడలేదు కానీ.. అండర్ 14, అండర్ 19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిపిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో రెండు మూడు మ్యాచులు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఇతడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు.
అతడి సలహాతో కెరీర్ మలుపు..
విఘ్నేశ్ పుత్తూర్.. ఓ ఆటోరిక్షా డ్రైవర్ కొడుకు. మొదట అతడు మీడియమ్ పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. అది అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. అనంతరం కేరళ కాలేజీ ప్రీమియర్ టీ20లీగ్ లో స్టార్ ను చేసింది.గత సీజన్ లో సౌతాఫ్రికీ టీ20లీగ్ లో ముంబయి తరఫున నెట్ బౌలర్ గా సేవలందించాడు.