
అనిల్ కుంబ్లే ఖాతాలో ఆ రికార్డు
సౌతాఫ్రికా గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరో చెబితే కాస్త నమ్మడం కష్టమే. ఎందుకంటే సౌతాఫ్రికాలో ఎక్కువ వికెట్ల రికార్డు అనగానే అది ఒక పేసర్ పేరు మీదనే ఉండి ఉంటుందని అంతా అనుకుంటారు. అది నిజం కాదు. సౌతాఫ్రికాలో ఎక్కువ వికెట్లు తీసింది టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే. సఫారీ గడ్డపై 12 టెస్టు మ్యాచ్లు ఆడిన కుంబ్లే.. 24 ఇన్నింగ్స్ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో భారత పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ ఉన్నాడు. అక్కడ 8 టెస్టు మ్యాచ్లు ఆడిన జాక్ 15 ఇన్నింగ్స్ల్లో 30 వికెట్లు పడగొట్టాడు.

ఒకే ఇన్నింగ్స్లో ఎక్కువ వికెట్లు తీసింది భజ్జీనే
సౌతాఫ్రికాలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ల్లో ఓ ఇన్నింగ్స్ల్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో టర్బోనేటర్ హర్బజన్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. కేప్టౌన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భజ్జీ ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టాడు. 2011లో జరిగింది ఈ మ్యాచ్. ఈ రికార్డు కూడా పేసర్ కాకుండా స్పిన్నర్ పేరుపై ఉండడం విశేషం.
ఇక 2013లో డర్బన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా. ఆ తర్వాత మూడో స్థానంలో మహమద్ షమీ ఉన్నాడు. జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు ఇచ్చి షమీ 5 వికెట్లు తీశాడు. ఇక అదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి నాలుగో స్థానంలో పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు.

ఎక్కువ పరుగులు చేసిందే వీళ్లే
సౌతాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అక్కడ సచిన్ అత్యధికంగా 1,161 పరుగులు చేశాడు. ఆ తర్వాత ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ 624 పరుగులు చేశాడు.
ఆ తర్వాత మూడో స్థానంలో తెలుగు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్ 566 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 558 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. గంగూలీ 506 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












