అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?
ఐపీఎల్ 2019 సీజన్లో బెస్ట్ స్పిన్నర్ ఎవరు? కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ను అడిగితే ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్ను అని హిందుస్తాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్యూలో అశ్విన్ వెల్లడించాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ "ప్రస్తుతం, నేను బెస్ట్ స్పిన్నర్ని. సుదీర్ఘకాలంగా రాణిస్తున్నది నేనే" అని అన్నాడు.
ఇది నాకు 11వ ఐపీఎల్ సీజన్
"ఇది నాకు 11వ ఐపీఎల్ సీజన్. దీనిని బట్టి తెలుస్తోంది నేను అత్యుత్తమ స్పిన్నర్గా రాణిస్తున్నానని. ఇతరులతో పోటీపడటానికి నేనెప్పుడు వెనుకడుగేయలేదు. సమయంతో పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకానొక స్టేజిలో మనకంటే మంచి ప్రదర్శన చేసేవాళ్లు రావొచ్చు" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో పంజాబ్ పేలవ ప్రదర్శన
ఈ సీజన్లో పంజాబ్ పేలవ ప్రదర్శన చేయడానికి కారణం మిడిలార్డర్ వైఫల్యమేనా? అన్న ప్రశ్నకు గాను అశ్విన్ "అలా అని చెప్పకూడదు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ కూడా మంచి పరుగులే చేశారు. డేవిడ్ మిల్లర్ ఇప్పటికే 150 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సర్ఫరాజ్ 49 యావరేజితో 200 పరుగులు చేశాడు" అని అశ్విన్ అన్నాడు.
ప్లే ఆఫ్ చేరుతుందా మరి
ఇక, పంజాబ్ విషయానికి వస్తే ఈ సీజన్లో ప్లే ఆఫ్ కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లాడిన పంజాబ్ కేవలం ఐదు మ్యాచ్ల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా శుక్రవారం సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో తలపడనుంది.