IND vs USA: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా మొదటి మ్యాచ్లో టీమిండియా అమెరికా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 29 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్తో జరిగిన మ్యాచ్లో అమెరికా జట్టులో ఓ తెలుగు ఆటగాడు బరిలోకి దిగడం విశేషంగా మారింది. ఆంధ్ర మూలాలున్న యువ క్రికెటర్ సాయితేజ ముక్కామల అమెరికా తరఫున ఆడుతూ భారత అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అమెరికా బ్యాటింగ్ టాపార్డర్లో బ్యాటింగ్ చేస్తూ కీలక ఆటగాడిగా నిలిచాడు. శనివారం భారత్తో జరిగిన మ్యాచ్లో సాయితేజ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఆంధ్ర మూలాలు.. అమెరికా కలలు
సాయితేజ ముక్కామల తండ్రి నాగేశ్వర్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. అయితే సాయితేజ 2004లో అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న సాయితేజకు 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడం ఓ పెద్ద స్ఫూర్తిని ఇచ్చింది. ఆ రోజే తానూ ఒక గొప్ప క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొడుకు కలను నిజం చేసేందుకు అతని తండ్రి నాగేశ్వర్ రెడ్డి చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. 2018లో అమెరికాలో తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని, భారీ జీతాన్ని వదులుకుని సాయితేజను హైదరాబాద్కు తీసుకువచ్చారు.

లక్ష్మణ్ అకాడమీలో శిక్షణ.. కెరీర్ మలుపు
హైదరాబాద్కు వచ్చిన తర్వాత సాయితేజ ప్రసిద్ధ వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ కఠినమైన శిక్షణ పొందడం అతని టెక్నిక్ను మెరుగుపరిచింది. భారత గడ్డపై లభించిన ఈ అనుభవం సాయితేజను పరిపూర్ణ ఆటగాడిగా తీర్చిదిద్దింది. తిరిగి అమెరికా వెళ్లిన అనంతరం అక్కడ స్థానిక లీగ్స్లో రాణించి అతి తక్కువ కాలంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
రికార్డుల వీరుడు: గణాంకాల్లో సాయితేజ సత్తా
సాయితేజ కేవలం ప్రవాస భారతీయుడు అనే కోటాలో కాకుండా, తన అద్భుతమైన ఫామ్తో అమెరికా జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అతని గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాయితేజ టీ20ల్లో 18 ఇన్నింగ్స్ల్లో 63కి పైగా సగటుతో, 150 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అమెరికా తరఫున వన్డేల్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2024లో కెనడాపై తన తొలి టీ20లోనే హాఫ్ సెంచరీ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
గెలవడానికే వచ్చాం.. భారత్కు సవాల్!
ప్రపంచకప్ ప్రారంభానికి ముందే సాయితేజ తన లక్ష్యాన్ని స్పష్టం చేశాడు. "మేము కేవలం మ్యాచ్లు ఆడడానికి రాలేదు, గెలవడానికి వచ్చాం" అని ధీమాగా ప్రకటించాడు. న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో మెరిసిన సాయితేజ, ఇప్పుడు భారత బౌలింగ్ దిగ్గజాలైన బుమ్రా, సిరాజ్ వంటి వారిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఒకప్పుడు భారత్ గెలుపును చూసి క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. ఇప్పుడు అదే భారత్కు సవాల్ విసరడం ఈ టీ20 ప్రపంచకప్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన అంశంగా మారింది.