IPL 2026: ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను కోటీశ్వరులను చేసే వేదిక. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని ఓ కుర్రాడి కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఏకంగా రూ.5.20 కోట్లు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతనే మధ్యప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ మంగేష్ యాదవ్.
ఎవరీ మంగేష్ యాదవ్?
మంగేష్ యాదవ్ మధ్యప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల లెఫ్టార్మ్ పేస్ ఆల్రౌండర్, చివర్లో వచ్చి దూకుడుగా ఆడటం అతని స్పెషాలిటీ. 2002, అక్టోబర్ 10న జన్మించిన మంగేష్ యాదవ్ అద్భుతంగా యార్కర్లను సంధించగలడు. క్రికెట్లో లెఫ్టార్మ్ బౌలర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లు వేయడం మంగేష్ ప్రత్యేకత.

రూ. 30 లక్షల నుంచి రూ. 5.20 కోట్లకు..
వేలంలో మంగేష్ యాదవ్ బేస్ ధర కేవలం రూ. 30 లక్షలు మాత్రమే. కానీ వేలం ప్రారంభం కాగానే ఆర్సీబీ ఏమాత్రం తడుముకోకుండా బిడ్డింగ్ మొదలుపెట్టింది. మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా పోటీకి రావడంతో ధర అమాంతం పెరిగిపోయింది. చివరికి పట్టువదలని ఆర్సీబీ రూ. 5.20 కోట్లు చెల్లించి ఈ యువ సంచలనాన్ని దక్కించుకుంది.
ఆర్సీబీ కన్ను ఇతనిపై ఎందుకు పడింది?
జాతీయ స్థాయిలో మంగేష్ ఆడింది కేవలం రెండు టీ20 మ్యాచ్లు మాత్రమే. కానీ మధ్యప్రదేశ్ టీ20 లీగ్లో ఇతను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. గ్వాలియర్ చీతాస్ జట్టు తరపున ఆడిన మంగేష్, కేవలం 6 మ్యాచ్ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఇతని బౌలింగ్ సగటు 12.00 మాత్రమే ఉండటం విశేషం. టోర్నమెంట్లో మూడు సార్లు 4 వికెట్ల హాల్ సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్తో కలిసి ఒకే జట్టులో ఆడటం వల్ల మంగేష్ యాదవ్ ప్రతిభ గురించి ఆర్సీబీ మేనేజ్మెంట్కు ముందే స్పష్టమైన సమాచారం ఉంది.
యశ్ దయాల్కు ప్రత్యామ్నాయంగా?
ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో ప్రధాన లెఫ్టార్మ్ పేసర్గా యశ్ దయాల్ ఉన్నాడు. అయితే అతని ఫిట్నెస్ లేదా లభ్యతపై ఏవైనా సందేహాలు ఉంటే, మంగేష్ యాదవ్ ఒక పక్కా బ్యాకప్గా ఉంటాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. కొత్త బంతితో వికెట్లు తీయడమే కాకుండా, చివరి ఓవర్లలో పరుగులు నియంత్రించగల సామర్థ్యం మంగేష్ సొంతం. విరాట్ కోహ్లీ వంటి దిగ్గజం ఉన్న జట్టులో, కోట్లు పెట్టి కొన్న ఈ యువ బౌలర్ వచ్చే సీజన్లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.