
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం జరిగిన ప్రతిసారీ కొత్తవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన రెండు రోజుల వేలంలో కొందరు కొత్తవాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అల్లుడైన మయాంక్ దాగర్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేయగా... రాజస్థాన్లో ఓ కాంపౌండర్ కొడుకైన ఖలీల్ అహ్మద్ను సన్రైజర్స్ ఏకంగా రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.
ఇక, భారత కుబేరుల్లో ఒకడైన కుమార మంగళం బిర్లా కొడుకు ఆర్యమన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ జట్టు వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఆర్యమన్ బిర్లా తన క్రికెట్ కలను ఐపీఎల్ ద్వారా నిజం చేసుకోనున్నాడు.
జనవరి 28 (ఆదివారం) బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కుమారుడైన ఆర్యమన్ బిర్లాను సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ఆర్యమన్ బిర్లా వేలంలోకి కనీస ధర రూ. 20 లక్షలతో వచ్చాడు.
వేలంలో తొలి రౌండ్లోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిన సొంతం చేసుకోవడం విశేషం. ఆర్యమన్ బిర్లా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ను 2017-18 రంజీ సీజన్తో ప్రారంభించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్యమన్ బిర్లా మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలు అయిన స్టీవ్ స్మిత్, అజ్యింకె రహానే, బెన్ స్టోక్స్ లాంటి వారితో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో ఆర్యమన్ బిర్లా గురించి పాఠకులకు ప్రత్యేకం...:
* ఆర్యమన్ బిర్లా జులై 9, 1997న జన్మించాడు.
* కుమార్ మంగళం బిర్లా, నీరజ బిర్లాల ముగ్గురి సంతానంలో ఒకడు.
* 9 ఏళ్ల వయసు నుంచే ఆర్యమన్ బిర్లాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.
* ఆర్యమన్ ఆల్ రౌండర్, ఎడమచేతి వాటం బ్యాట్స్మన్.
* ముంబైలోని శివాజీ పార్కులో ముంబై కోచ్ ప్రవీణ్ ఆమ్రే వద్ద శిక్షణ తీసుకున్నాడు.
* తొలుత ఆర్యమన్కు శిక్షణ ఇచ్చేందుకు ప్రవీణ ఆమ్రే ఒప్పుకోలేదు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడి వద్దకు రావడంతో కాదనలేకపోయాడు.
* టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రవీణ్ ఆమ్రే మాట్లాడుతూ 'శివాజీ పార్కులో తన తల్లితో కలిసి ఆర్యమన్ నన్ను కలిసేందుకు వచ్చాడు. అతడు కుమార మంగళం బిర్లా కుమారుడు కావడంతో నా అకాడమీలో అతడిని తసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే అతడిలో టాలెంట్ ఉన్నందునే నా అకడామీలో చేర్చుకున్నాను' అని తెలిపాడు.
* ముంబైలో అవకాశాలు రాకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఆర్యమన్ మధ్య ప్రదేశ్లోని రేవా పట్టణానికి వెళ్లాడు.
* 2017/18లో U-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరుపున 795 పరుగులు చేయడంతో ఆర్యమన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఆర్యమన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
* టోర్నీలో భాగంగా ఛత్తీస్గడ్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ (230) నమోదు చేశాడు.
* 2017/18 రంజీ సీజన్లో నవంబర్ 25, 2018న ఒడిశాతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ తరుపున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 22 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మధ్య ప్రదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.