Rohith Sharma: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులోనూ గుజరాత్ టైటాన్స్ పై ముంబయి ఇండియన్స్ ఓడింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి మూటగట్టుకున్న ఈ ముంబయి జట్టు ఇంతవరకు ఈ సీజన్ లో బోణీ కొట్టలేదు. తాజా మ్యాచులో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (2/29) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఛేదనలో ముంబయి తడబడింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులే పరిమితమైంది. సూర్యకుమార్ (48; 28 బంతుల్లో 1×4, 4×6), తిలక్వర్మ (39; 36 బంతుల్లో 3×4, 1×6) రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ (8),.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదినప్పటికీ.. ఆ వెంటనే ఓ సూపర్ డెలివరీకి బౌల్డయ్యాడు.
గెలిచినా, ఓడినా అదే చేయాలి...
ఈ క్రమంలోనే ముంబయి మ్యాచ్ ఓటముల తర్వాత రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గెలిచిన, ఓడినా తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో వివరించాడు హిట్ మ్యాన్. "నా 17-18ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఒడుదొడుకులు చూశాను. అవి నా జీవితంలో ఎన్నో నేర్పాయి. మనం గెలిచినా, ఓడినా.. నవ్వడం నేర్చుకోవాలి. ఇది సింపుల్ గా అనిపిస్తుంది. కానీ అందులో చాలా అర్థం దాగి ఉంటుంది. ఏది జరిగినా, చివరికి మనం నవ్వడానికి ఓ మార్గాన్ని వెతుక్కోవాలి. అందులోనే మనశ్శాంతి ఉండాలి. మేమెప్పుడూ దాని గురించే చర్చిస్తాం. గెలిచినా, ఓడినా అక్కడి నుంచి ముందుకు సాగిపోతాం. ఓటములను అధిగమించడం అంత సలువు కాదు. కానీ జీవితమంటే పోరాడుతూ ముందుకు వెళ్లడమే కదా. జీవితం ఎప్పడూ అక్కడే ఆగిపోదు. ప్రతీరోజు సూర్యడు ఎలా అయితే ఉదయిస్తాడో, మనం కూడా అలానే పడినప్పుడు మరుసటి రోజు లేచి నిలబడాలి. కొత్త రోజుతో పోరాడటానికి సిద్ధంగా ఉంటూ.. చిరునవ్వుతో ముందుకు సాగాలి." అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

కాగా, ముంబయి ఇండియన్స్ తన తర్వాత మ్యాచును వాంఖడే స్టేడియంలో కేకేఆర్ తో తలపడనుంది. మార్చి 31న జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇప్పుడు ముంబయి ఇండియన్స్ 9వ స్థానంలో ఉంది.