గత వారం రోజులుగా టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గురించి వార్తలు వెల్లువెత్తున్నాయి. ఇషాన్ కిషన్పై బీసీసీఐ కోపంగా ఉందని, అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ను తొలగించడానికి సిద్ధంగా ఉందని కథనాలు వస్తున్నాయి. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు ఇషాన్ లెక్కచేయనందుకు బీసీసీఐ కొత్త నిబంధనలు కూడా తీసుకువస్తుందని న్యూస్ వచ్చింది. అతడిని దృష్టిలో పెట్టుకొని.. ఐపీఎల్లో ఆడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు రంజీ మ్యాచ్లు ఆడాలనే రూల్ అమలు చేయనుందని సమాచారం.
అయితే ఇషాన్ కిషన్ విషయంపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇషాన్ కెరీర్లో ఏం జరుగుతుందో తెలియట్లేదని, కానీ బోర్డుతో ఆటగాళ్లకు స్పష్టమైన సంప్రదింపులు ఉండాలని సూచించాడు. ''ఇషాన్ కిషన్ తప్పు చేస్తున్నాడా లేదా ఇతర ఆటగాళ్లు చేసేది ఒప్పా? తప్పా? అనే విషయం నాకు తెలియదు. కానీ స్పష్టమైన సంప్రదింపులు అవసరం. క్రికెట్ కెరీర్ను నిర్వహించడం అంత ఈజీ కాదు. నా కెరీర్లో ఆ విషయం చాలా కష్టంగా అనిపించింది'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్ లీగుల్లో పాల్గొన్న డివిలియర్స్ తన కెరీర్ ఆఖర్లో పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, ఇషాన్ కిషన్ వైఖరి ఎవరికీ అంతు చిక్కట్లేదు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో భారత జట్టుకు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. మానసిక అలసట కారణంగా విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ఇషాన్ కిషన్ ఎంపికఅవ్వలేదు. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ కూడా ఇచ్చాడు. మానసిక సమస్యల కారణంగా దూరమైన ఇషాన్ తిరిగి జట్టులోకి రావాలంటే పోటీ క్రికెట్ను ఆడి రావాలని సూచించాడు.
దీంతో రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని భావించారంతా. కానీ ఇషాన్ రంజీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. పాండ్య బ్రదర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ విషయపై బీసీసీఐ కోపంగా ఉందని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ ముంబయిలో జరగనున్న డీవై పటేల్ టోర్నమెంట్లో ఇషాన్ పాల్గొనున్నట్లు వార్తలు వస్తున్నాయి.