
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పోస్టు చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. వివరాల్లోకి వెళితే... ఆదివారం ముంబైలో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ వార్షిక అవార్డుల కార్యక్రమానికి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు కోహ్లీతో సహా భారత క్రికెటర్లు హాజరయ్యారు.
అయితే, ఈ ఫంక్షన్ తర్వాత భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ఓ గ్రూప్ ఫోటోని దిగారు. ఈ ఫోటోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేస్తూ "నవ్వులతో టీమిండియా" అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం గమనించిన నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తున్నారు.
"విరాట్ కోహ్లీ టీమిండియాలో భాగం కాదా? లేక కెప్టెన్గా ఆయనకు ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా?" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... విరాట్ కోహ్లీ ఎక్కడంటూ మరొక నెటిజన్ ప్రశ్నించాడు. మరోక నెటిజన్ "విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నానో ఆలోచిస్తున్న వారందరికీ, అతను చిత్రాన్ని క్లిక్ చేస్తున్నాడు .... భారీ త్యాగం .... నా ఫేవరేట్ కెప్టెన్" అంటూ మద్దతుగా నిలిచాడు.
ఇదిలా ఉంటే, ఈ అవార్డుల కార్యక్రమంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాని బీసీసీఐ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 2018-19 సీజన్లో అద్భుత ప్రదర్శనకుగాను బీసీసీఐ ఆదివారం అతడికి ఈ అవార్డు బహుకరించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రా.. ఈ సీజన్లో టెస్టుల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
దీంతో పురుషుల విభాగంలో ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం పాలీ ఉమ్రిగర్ అతడికి దక్కింది. ఈ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందించారు. దీంతో పాటు దిలీప్ సర్దేశాయ్ అవార్డు కూడా అతడిని వరించింది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కు ఈ పురస్కారాన్ని ఇస్తారు. 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా.. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్ చేజిక్కించుకున్నాడు.