Vaibhav Suryavanshi: భారత క్రికెట్లో 14 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఈ యువకెరటం ప్రతిభకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఫిదా అయ్యారు.
సచిన్తో పోల్చిన శశిథరూర్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ను చూసిన శశి థరూర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గతంలో ఒక 14 ఏళ్ల కుర్రాడు ఇంతటి అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం మనం సచిన్ టెండూల్కర్ విషయంలోనే చూశాం. ఇప్పుడు వైభవ్ ఆట చూస్తుంటే అద్భుతంగా ఉంది. మరి సెలెక్టర్లు ఇంకా దేని కోసం వేచి చూస్తున్నారు?" అని శశి థరూర్ ప్రశ్నించారు.

విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల వేట
అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన వైభవ్, సీనియర్ బౌలర్లను కూడా లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో బీహార్ జట్టు 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ స్కోరు కావడం విశేషం. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైనందుకు విమర్శించిన వారికి ఈ ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ గట్టి సమాధానం చెప్పాడు.
టీమిండియాలోకి ఇప్పుడే రాగలడా? ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?
శశి థరూర్ వంటి ప్రముఖులు వైభవ్ను వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నప్పటికీ, సాంకేతికంగా అది ఇప్పుడు సాధ్యం కాదు. దీనికి కారణం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పెట్టిన ఒక నిబంధన. 2020లో ఐసీసీ తెచ్చిన నిబంధన ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే ఏ ఆటగాడికైనా కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. వైభవ్ ఇప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఆయన 2026, మార్చి 27 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాతే సెలక్టర్లు అతడిని సీనియర్ టీమిండియాలోకి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. వయస్సు చిన్నదైనా, ఆడే తీరులో సీనియర్ల స్థాయి పరిణతి చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ, భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. 15 ఏళ్లు నిండిన తర్వాత ఈ కుర్రాడు నిజంగానే టీమిండియా జెర్సీ ధరిస్తాడా అనేది చూడాలి.