ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కే అభిమానులకు ధోనీ రాకపై నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత సీజన్లో జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తుండటంకో అందరి దృష్టంతా ఎంఎస్ ధోనీ ఫిట్నెస్పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ధోనీ లభ్యత గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. గత 3 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయిన సీఎస్కేకు ధోనీ లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. 44 ఏళ్ల ఈ దిగ్గజ ఆటగాడు ఎప్పుడు మైదానంలోకి వస్తాడా అని కోట్లాది మంది ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో!
సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ధోనీ ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. "ఎంఎస్ ధోనీ కోలుకునే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.. అయితే ధోనీ మైదానంలోకి వచ్చే ఖచ్చితమైన సమయాన్ని ఇప్పుడే చెప్పలేమని.. దీనికి మరికొన్ని రోజులు పట్టవచ్చని సీఎస్కే సీఈవో చెప్పుకొచ్చారు. ప్రీ-సీజన్ క్యాంపులో ధోనీ మోకాలికి గాయమైందని.. అందుకే ఆయన ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని సమాచారం. సీఎస్కీ సీఈవో ప్రకటన ధోనీ రావడానికి మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఇది సీఎస్కే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

సీఎస్కేకు గుడ్ న్యూస్!
ఎంఎస్ ధోనీ అందుబాటులో లేకపోయినప్పటికీ.. మరో కీలక ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ రీఎంట్రీపై జట్టు ఆశాభావంతో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ యువ బ్యాటర్ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే డెవాల్డ్ బ్రెవిస్ వేగంగా కోలుకుంటున్నాడని.. తదుపరి మ్యాచ్ లో డెవాల్డ్ బ్రెవిస్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సీఎస్కే సీఈవో వెల్లడించారు. గత సీజన్లో డెవాల్డ్ బ్రెవిస్ 180 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడంతో బ్రెవిస్ రాక జట్టు మిడిలార్డర్కు బలాన్ని ఇస్తుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా డెవాల్డ్ బ్రెవిస్ రాకపై సానుకూలంగా స్పందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫ్లైమింగ్ మాట్లాడుతూ.. బ్రెవిస్ తదుపరి పోరులో అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ లేని లోటును పూడ్చుకుంటూ తిరిగి విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా, "తలా" ధోనీ మైదానంలో ఎప్పుడు కనిపిస్తాడనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.