న్యూఢిల్లీ : అభిమానులకు ఆరాధ్య ఆటగాళ్లు ఉన్నట్లే.. ఆ ఆరాధ్య ఆటగాళ్లకూ అభిమాన ఆటగాళ్లు ఉంటారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం ద్వారా దేశాభిమానాన్ని చూరగొన్న సాక్షి మాలిక్ కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి. ఎందుకంటారా..? ఢిల్లీలో ఘనస్వాగతం పొందిన సాక్షి మాలిక్.. తన అభిమాన క్రికెటర్స్ ను కలవాలనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టింది.
ఆ అభిమాన క్రికెటర్స్ మరెవరో కాదు.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సిద్దూ. ఈ ఇద్దరినీ క్రికెటర్లను తాను కలవాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తన కోరికను వెలిబుచ్చింది సాక్షి. "రేపు లేదా ఎల్లుండి.. మీకెప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు... సమయం చెప్పండి సార్ నాకు మిమ్మల్ని కలవాలనుంది" అని ట్వీట్ చేసింది సాక్షి.
సాక్షి ట్వీట్ పై స్పందించిన సెహ్వాగ్.. 'తప్పకుండా కలుద్దాం.. అయితే కలిసినప్పుడు మాత్రం నాతో రెజ్లింగ్ చేయొద్దు అంటూ' ట్విట్టర్ ద్వారా సరాదాగా స్పందించాడు. ఇకపోతే రియో ఒలింపిక్స్ నుంచి బుధవారం ఢిల్లీలో అడుగుపెట్టిన సాక్షికి ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. అనంతరం బహదూర్ ఘర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రూ.2.5కోట్ల చెక్కును సాక్షికి బహూకరించింది హర్యానా ప్రభుత్వం. అంతేకాదు, భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది హర్యానా ప్రభుత్వం.