మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడని తెలుసు. బౌలర్లపై విరుచుకు పడతాడనీ తెలుసు. పిడుగుల్లాంటి షాట్లతో బౌలర్ల భరతం పట్టడాన్నీ మనం చాలాసార్లు చూశాం. ఎంజాయ్ చేశాం. కదా? మరి కోహ్లీ బౌలర్ అని, వికెట్లు కూడా పడగొట్టాడనే విషయం ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే- ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే చెప్పుకొవాల్సి వచ్చింది. తానూ బౌలింగ్ చేయగలనని, ప్రమాదకరమైన బౌలర్నని తనకు తానే భుజం తట్టుకోవాల్సి వచ్చింది.
వర్షం వల్ల తొలి సెమీస్ తుడచి పెట్టుకుని పోతే.. టీమిండియా పరిస్థితేంటీ?
ఇదలావుంచితే.. 2008 ఫిబ్రవరి 27వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచకప్ అండర్-19 టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించగా.. న్యూజిలాండ్కు కేన్ విలియమ్సన్ నేతృత్వం చేపట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరే తమ దేశ సీనియర్ జట్లకు నాయకత్వం వహిస్తుండటం ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీఫైనల్లో మరోసారి ఎదురు పడటం యాదృశ్చికంగానే భావించుకోవచ్చు.
ప్రపంచకప్ అండర్-19 టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బౌలర్గా అవతారం ఎత్తాడు. తన కౌంటర్ పార్ట్ కేన్ విలియమ్సన్ను అవుట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విరాట్ కోహ్లీ సంధించిన బంతిని లెగ్సైడ్లోకి ఆడటానికి కేన్ విలియమ్సన్ క్రీజు వదిలి ముందుకొచ్చాడు. బంతి కాస్త మిస్ అయ్యింది. నేరుగా వికెట్ కీపర్ గోస్వామి చేతుల్లో వాలింది. అంతే! వికెట్లను గిరాటు వేసేశాడు గోస్వామి. దీనితో విలియమ్సన్ స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు.
ఆ మ్యాచ్లో ఏకంగా 80 బంతులను ఆడిన విలియమ్సన్ 37 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఉన్నవి మూడు ఫోర్లే. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మొత్తం ఏడు ఓవర్లు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేన్ విలియమ్సన్ వికెట్ను పడగొట్టాడు. అప్పట్లోనే పొదుపుగా బౌలింగ్ చేసేవాడు కోహ్లీ. జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన తరువాత కోహ్లీ ఎందుకోగానీ ఇక బంతిని అందుకునే సాహసాన్ని చేయలేకపోయాడు. సీనియర్ల జట్టులో చోటు సంపాదించుకున్న తరువాత బౌలింగ్ చేసిన సందర్భాలు చాలామటుకు లేవు.