న్యూఢిల్లీ: చారిత్రాక లార్డ్స్ మైదానంలో భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి భారత్ విజయాన్ని సంబరంగా చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లాండు పైన నాట్ వెస్ట్ ట్రోఫీ విజయాన్ని గంగూలీ అలా సెలబ్రేట్ చేసుకున్నాడు.
అయితే, తనలాగే అందరు కూడా చొక్కాలు విప్పి గాల్లో ఊపాలని నాడు సారథిగా ఉన్న గంగూలీ సూచించాడు. అయితే, అతని కోరికను జట్టు సీనియర్ ఆటగాళ్లు సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని నాడు టీమ్ మేనేజర్గా వ్యవహరించిన రాజీవ్ శుక్లా వెల్లడించారు.

తనలాగే చొక్కాలు విప్పి సెలబ్రేట్ చేసుకోవాలని గంగూలీ సూచించాడని, కానీ సీనియర్లైన సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అంగీకరించలేదని చెప్పాడు. వాంఖేడే మైదానంలో సిరీస్ సమం చేసిన ఆనందంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్లింటాఫ్ చొక్కా విప్పినందుకు ప్రతిగా, తాము కూడా అలా చేయాలని గంగూలీ భావించాడని చెప్పాడు.
2002వ సంవత్సరంలో నార్త్ వెస్ట్ ట్రోఫీ సందర్భంగా గెలిచినప్పుడు గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తమ ముందు ఉంచిన 325 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాడు చేధించింది. కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) పరుగులు చేశారు.