
హైదరాబాద్: టీమిండియా ఉమెన్ క్రికెటర్ స్మృతి మంధాన శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు వీరాభిమానట. మంధాన ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతోన్న దేశీవాలీ లీగ్లో ఆడుతోంది. వెస్టరన్ స్టోర్మ్ జట్టు తరపున ఆడుతోన్న ఆమె ఆరు మ్యాచ్లలోనే 338 పరుగులు చేసింది. బ్యాటింగ్కు దిగిందంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే అనే స్థాయిలో ఊపందుకుంది మంధాన.
ఈ టోర్నీకి కామెంటేటర్గా వ్యవహరిస్తోన్న కుమార సంగక్కర అంటే ఆమెకు విపరీతమైన అభిమానమట. భారత జట్టులో సెలక్ట్ అవకముందు నుంచే ఆమె సంగక్కర బ్యాటింగ్ను చూస్తూ ఉండేదట. అయితే కామెంటేటర్లలో సంగరక్కర కూడా ఒకరనే విషయం అతనే ట్వీట్ ద్వారా చెప్తేనే గానీ తెలియలేదట. దాంతో.. మంధాన తన జట్టు మేనేజర్ను ఒక్క సారి సంగక్కరను కలవాలంటూ కోరిందట. అలా కలిసి శ్రీలంక క్రికెటర్తో కాసేపు ముచ్చటించిన ఆమె ఆనందంలో మునిగిపోయిందట.
'నేను ఇక్కడ మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు సంగక్కర కామెంటేటర్గా ఉన్నారట. ఆ విషయం నాకు తెలియదు. అతనే ట్వీట్ చేసింది. మ్యాచ్ చూశాను. మంధాన చాలా బాగా ఆడింది. అని ట్వీట్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్నాను. వెంటనే మేనేజర్ని అడగడంతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇలా ఎవ్వరికోసం ఇప్పటివరకూ అడగలేదు. ఎందుకంటే అతనే నాకు ఆదర్శం. నేను ఇంతటి ఫామ్లోకి రాకముందే అతని వీడియోలు చూస్తూ ఉత్సాహం పొందేదాన్ని. నమ్మకంగా తల ఎత్తుకుని నుంచోవడం నాకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చారు.
సంగక్కరతో మాట్లాడిన మంధాన తన బ్యాటింగ్ ఎలా ఉందో చెప్పమని అడిగిందట. దానికి బదులిచ్చిన సంగక్కర 'మీరు చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించకండి. ఎంతబాగా కుదిరితే అంతలా రాణించేందుకు ప్రయత్నించండి. నాకైతే ఏదో లోపం ఉన్నట్లు అనిపించలేదు' అని చెప్పాడట. మంధాన కొట్టిన షాట్లు వెస్టరన్ స్టోర్మ్ జట్టును లీగ్ టేబుల్లో రెండో స్థానంలో నిలబెట్టాయట.