హైదరాబాద్: వివాస్పదమైన 2008 సిడ్నీ టెస్టుకు ముందుకు సచిన్ టెండూల్కర్ ఎలర్జెక్ రియాక్షన్తో తీవ్రంగా బాధపడ్డారు. ముఖంలో కూడా అది కనిపించింది. ఆ నొప్పితో అతను తీవ్రంగా బాధపడడమే కాకుండా హోటల్ మేనేజర్పై అరిచాడు కూడా. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో వివరించాడు.
2007 డిసెంబర్లో జరిగిన మెల్బోర్న్ టెస్టు సందర్భంగా తీవ్రమైన అలర్జెక్ రియాక్షన్ ప్రారంభమైందని, అది ఊహించింది కాదని, ఆస్ట్రేలియాకు వెళ్తూ తానూ హర్భజన్ సింగ్ సింగపూర్ విమానాశ్రయంలో కొత్తగా వచ్చిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ కొన్నామని, దాన్ని వాడిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉందని, ఆ తర్వాత తన ముఖంలో బర్నింగ్ సెన్సేషన్ ప్రారంభమైందని చెప్పాడు.
హర్భజన్ సింగ్కు ఆ క్రీమ్ వల్ల ఏమీ కాలేదని, దాంతో మసాజ్ వల్లనే ఆ రియాక్షన్ వచ్చిందని అనుకున్నానని, ముఖాన్ని టవల్పై పెట్టుకుని పడుకోవాల్సి వచ్చేదని ఆయన అన్నాడు. మెల్బోర్న్ టెస్టులో అలర్జీ వల్ల ముఖం మండసాగిందని, దాంతో దాన్ని దాచిపెట్టడానికి పెద్ద సన్ గ్లాసులు వాడానని చెప్పాడు. మూడో రోజుకి నొప్పి మరింత పెరిగిందని, తగ్గుతుందనే ఉద్దేశంతో నిద్రకు వెళ్లడానికి ముందు మరింత ఎక్కువ క్రీమ్ రాసుకున్నానని వివరించాడు. మర్నాడు లేచే సరికి తన ముఖం మంట పుట్టసాగిందని చెప్పాడు.
సాయంత్రానికి పరిస్థితి మరింత విషమించిందని, తన ముఖం పూర్తి ఎర్రబారి, ఉబ్బిపోయిందని, దాంతో నలుగురి ముందుకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డానని, దాంతో సన్ గ్లాస్లు ధరించి దాచుకోవడానికి ప్రయత్నించానని ఆయన చెప్పాడు. మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత తర్వాత టెస్టుకు సిడ్నీ వెళ్లామని, తనకూ తన కుటుంబానికీ గదులు కేటాయించడానికి హోటల్ సిబ్బంది తనను నిరీక్షణలో పెట్టారని, నొప్పితో బాధపడుతున్న తాను హోటల్ మేనేజర్పై అరిచానని చెప్పాడు.
మర్నాడు అంజలి సిడ్నీ రావాల్సి ఉందని, మెల్బోర్న్ టెస్టు నాలుగో రోజునే ముగియడంతో తొందరగా సిడ్నీ వెళ్లడానికి తాను అనుమతి తీసుకున్నానని, అంజలినీ పిల్లలను ముందుగానే విమానాశ్రయంలోనే కలుసుకోవచ్చునని అనుకున్నానని, తన ముఖం చాసి వారు భయపడ్డారని, ఎంత పనిచేసుకున్నావని ఆందోళన వ్యక్తం చేశారని, దాంతో సాధ్యమైనంత త్వరగా హోటల్కు చేరుకోవాలని భావించానని సచిన్ టెండూల్కర్ వివరించాడు.

ట్రాఫిక్ కారణంగా హోటల్ చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టిందని, దాంతో చిరాకు పుట్టిందని, పైగా హోటల్ సిబ్బంది గదులు కేటాయించడానికి చాలా సమయం తీసుకున్నారని, దాంతో హోటల్ మేనేజర్పై అరిచానని చెప్పాడు. గదుల కేటాయింపు జరిగే సమయానికి పరిస్థితి మరింత విషమించిందని, పిల్లలను పక్క గదిలో కూర్చోవాలని చెప్పాలని తాను అంజలికి సూచించానని, తనను ఒంటరిగా వదిలేయాలని చెప్పానని, ఈ విధంగా తాను ప్రవర్తించడానికి కారణమేమిటో తెలియక పిల్లలు ఆశ్చర్యపడ్డారని, ముఖం నొప్పి మరింత పెరిగిందని ఆయన వివరించాడు.
దాంతో హోటల్ రిసెప్షన్కు ఫోన్ చేసి వైద్యుడ్ని పంపించాలని అడిగానని, అయితే వైద్యుడు అందుబాటులో లేడని చెప్పారని, దాంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రి గురించి వాకబు చేశానని, వెంటనే అక్కడికి వెళ్లానని, కొద్ది పరీక్షల తర్వాత తనకు ఓ లోషన్ ఇచ్చారని, రాత్రి వాడి మర్నాడు ఉదయమే రావాలని సూచించారని చెప్పాడు.
మర్నాడు ఆస్పత్రికి వెళ్లి తాను టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ఊరటనిచ్చేది ఏదైనా చేయాలని అడిగానని, వైద్యుడు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించాడని, అయితే తాను మాత్రం మ్యాచ్ ఆడాలనే అనుకున్నానని, ఆ సాయంత్రం తాను ప్రాక్టీస్లో పాల్గొనాల్సి ఉండిందని, అయితే తాను ఎండకు దూరంగా ఉండాల్సిన పరిస్థితిలోనే ఉన్నానని చెప్పాడు.
తన మిత్రుడు, భారత మాజీ మీడియం పేసర్ సుబ్రతో బెనర్జీ సిడ్నీలో ఉంటున్నాడని, దాంతో అతని ద్వారా 45 నిమిషాల పాటు ఇండోర్ ప్రాక్టీస్ చేశానని సచిన్ చెప్పాడు. మర్నాడు తాను మైదానంలో అడుగు పెట్టగలిగానని సచిన్ చెప్పాడు. మొదటి సారి తాను ఫ్లాపీ వైట్ హ్యాండ్ వాడానని, అది తన ట్రేడ్ మార్కుగా మారిందని చెప్పాడు. ముఖానికి చాలా ఐస్ పట్టించానని, జింక్ క్రీమ్తో ప్లాస్టర్ చేశానని చెప్పాడు. అది ఎగతాళి చర్యగా కనిపించింది గానీ తనను ఇబ్బంది పెట్టలేదని అన్నాడు. మరో రెండు రోజుల తర్వాత సాధారణ పరిస్థితికి చేరుకున్నానని చెప్పాడు.