హైదరాబాద్: సమయపాలన (పంక్చువాలిటీ)తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమని గంగూలీకే గుర్తుచేశారట. అది మరెవరో కాదు, ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి. అప్పుడు కెప్టెన్గా ఉన్నా సరే.. టైమ్కి ఎవ్వరైనా ఒక్కటే అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఒకసారి భారత క్రికెట్ జట్టు సారథి సౌరభ్ గంగూలీ చెప్పిన సమయానికి రాకపోతే అతన్ని మిగతా జట్టంతా వదిలి వెళ్లిందట. దీంతో అతడు మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు పది నిమిషాలు ముందుగానే చెప్పిన చోటుకి వెళ్లేవాడట.
ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇటీవల ఓ వెబ్ షోలో టీమిండియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. 'జట్టులో ఆటగాడు తప్పు చేస్తే వారికి నేను మరో అవకాశం ఇవ్వను. సమయపాలనతో వ్యవహరిస్తే ఎప్పుడైనా మనం హుందాగా కనిపిస్తాం. ఇదో మంచి లక్షణం. టీమిండియాలో దీనికే అధిక ప్రాధాన్యం. ఆటగాళ్లందరూ తప్పక అనురించాల్సిందే.'
'టీమ్ బస్సు తొమ్మిదింటికి స్టార్ట్ అని చెప్తే ఆ సమయానికి వెళ్లాల్సిందే. ఎవరు వచ్చారు.. ఎవరు రాలేదు అని చూడరు' అని చెప్పిన శాస్త్రి ఓ అనుభవాన్ని పంచుకున్నాడు. 2007లో నేను టీమిండియాకు మేనేజర్గా పని చేశాను. ఆ సమయంలో గంగూలీ జట్టుకు కెప్టెన్ బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సమయంలో.. చిట్టగ్యాంగ్ మైదానంలో ఏర్పాటు చేసిన తొలి ప్రాక్టీస్కు హాజరు కావల్సి ఉంది.'
'తొమ్మిది గంటలకు ఆటగాళ్లతో ఉన్న బస్సు ప్రారంభంకావాలి. బస్సు స్టార్ట్ చేయమంటే స్థానిక మేనేజర్ ఒకరు దాదా (గంగూలీ) ఇంకా రాలేదు అని అన్నారు. దాదా కారులో వస్తాడులే.. బస్సు స్టార్ట్ చెయ్యండి అని అన్నాను. మేము మైదానానికి వెళ్లాం. అప్పటి నుంచి గంగూలీ చెప్పిన సమయాని కంటే పది నిమిషాల ముందుగానే రావడం అలవాటు చేసుకున్నాడు. చాలాసార్లు ఇది గమనించాను' అని శాస్త్రి తెలిపాడు.