రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ ప్రీతి జింటా గురించి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. 2017 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా ఒక గొప్ప పని చేశారని సందీప్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అసలు విషయం ఏమిటంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 2017లో జరిగిన మ్యాచ్లో సందీప్ శర్మ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. ఆ మ్యాచ్లో 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఏర్పడింది. ఆ సమయంలో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. అందులో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాల వికెట్లను పడగొట్టాడు.

ఈ మ్యాచ్ విజయం సాధించిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మొదట అక్షర్ పటేల్కు ఇవ్వాలని నిర్ణయించారు. అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో 38 పరుగులు చేసి, మూడు వికెట్లు కూడా తీశాడు. అయితే ప్రీతి జింటా జోక్యం చేసుకుని, అప్పటి కామెంటేటర్ రవిశాస్త్రితో.. "ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సందీప్ కే ఇవ్వాలి. ఎందుకంటే అతను మూడు కీలకమైన వికెట్లు తీశాడు" అని చెప్పారని సందీప్ శర్మ వెల్లడించారు.
ప్రీతి జింటా కీలక నిర్ణయం
ప్రీతి జింటా మాటలను గౌరవించిన రవిశాస్త్రి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సందీప్ శర్మకే ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో సందీప్ శర్మ మాట్లాడుతూ.. "నిజానికి అవార్డు అక్షర్ పటేల్కే ఇవ్వాలని అనుకున్నారు. కానీ ప్రీతి మేడమ్ చెప్పడంతో అది నాకొచ్చింది. నేను ఆ అవార్డును అక్షర్ కు ఇచ్చేందుకే వెళ్తే, అతను ఈ మూడు వికెట్లు చాలా ముఖ్యమైనవి. నువ్వు అవి తీయకుంటే 138 పరుగులు ఎక్కడా కాపాడబడేవి కావు.. అని చెప్పాడు" అని సందీప్ శర్మ వివరించారు.
సందీప్ శర్మ ఆల్ టైమ్ బెస్ట్ బౌలర్ల జాబితా ఇదే..
సందీప్ శర్మ తన ఆల్-టైమ్ బెస్ట్ బౌలర్ల జాబితాను కూడా పంచుకున్నాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(భారత్), వసీం అక్రమ్(పాకిస్థాన్), జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్), డేల్ స్టెయిన్(దక్షిణాఫ్రికా), గ్లెన్ మెక్గ్రాత్(ఆస్ట్రేలియా) వంటి దిగ్గజాలకు సందీప్ తన జాబితాలో స్థానం కల్పించారు.