న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనని భారత నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా తెలిపింది. స్పాన్సర్లు లభించని కారణంగా విదేశీ టోర్నీల్లో పాల్గొనడానికి చాలా ఇబ్బందులు పడిన తనను మోడీ ప్రభుత్వం ఆదుకుందని సోమవారం ఉజ్బెకిస్థాన్లో జరిగే టోర్నీకి బయలుదేరే ముందు పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత వివరించింది.
నిరుడు తాను కేవలం 11 విదేశీ టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నానని, మోడీ ఆదుకోవడంతో ఈ ఏడాది ఇప్పటికే విదేశాల్లో ఏడు టోర్నీలు ఆడానని తెలిపింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి ఆర్థిక పరమైన ఇబ్బందులను వివరించానని చెప్పింది. ప్రస్తుతం దేశంలో నంబర్ వన్గా ఉన్నానని, గుజరాత్ నుంచి ఈ స్థాయికి చేరుకున్న మొదటి క్రీడాకారిణిని తానేనని వివరించానని తెలిపింది. తన ప్రతి మాటనూ శ్రద్ధగా ఆలకించిన మోడీ త్వరలోనే పరిష్కారాన్ని చూపుతానని, డబ్బు గురించి ఆందోళన చెందకుండా మ్యాచ్లపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారని అంకిత చెప్పింది.

ఆయన అన్నట్టుగానే వారం రోజుల్లోనే తనకు ఐదు లక్షల రూపాయల చెక్కు లభించిందని పేర్కొంది. విదేశీ పర్యటనలకు అవసరమైన ఖర్చును గుజరాత్ ప్రభుత్వమే భరిస్తున్నదని, ఇప్పటి వరకూ సుమారు 15 లక్షల రూపాయల వరకూ సాయం అందడంతో తనపై ఒత్తిడి తగ్గిందని తెలిపింది. ఒక సీజన్లో సుమారు 30 వారాల పాటు ఆడాల్సి ఉంటుందని, దీనికి భారీగా ఖర్చవుతుందని చెప్పింది. డబ్బు కోసం ఇబ్బందులు పడుతూ టోర్నీల్లో రాణించడం సులభం కాదని తెలిపింది.
మోడీ ప్రధాన మంత్రి కావడంతో దేశ వ్యాప్తంగా తనలాంటి ఎంతో మందికి సాయం అందుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. సాధ్యమైనన్ని ఎక్కువ టోర్నీల్లో విజయాలను సాధించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. ఉజ్బెకిస్థాన్లో టైటిల్ అందుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతానని పేర్కొంది. ప్రభుత్వ పరంగా లభిస్తున్న ప్రోత్సాహానికి తగిన న్యాయం చేస్తానని చెప్పింది.