హైదరాబాద్: భారత క్రికెట్లో ఓ అధ్యాయం ముగిసింది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అందరి మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోనీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా సిరీస్లో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏళ్ల ధోని తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని ఫోటో గ్యాలరీ
జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు ధోని వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా అందుబాటులో ఉంటాడు.

కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. ధోని హయాంలో టీమిండియా అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. మూడు ఫార్మెట్లలో కూడా భారత్కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు.
గొప్ప ఫినిషర్గా పేరొందిన ధోని తన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికుల్ని అలరించాడు. టెస్టులు, వన్డేలు, టీ20లకు కెప్టెన్గా ఉన్న ధోని అనేక విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.
మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్ల్లో జట్టుకు నాయకత్వం వహించిన ఒకే ఒక్క కెప్టెన్ ధోని మాత్రమే. భారత క్రికెట్కు ధోని అందించిన ఓ అధ్భుతమైన కానుక ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు.