
ఐదు వికెట్లతో చెలరేగిన వెంకటేశ్ ప్రసాద్
టీమిండియా పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగగా... విండిస్ బ్యాట్స్మన్ శివనారాయణ్ చందర్పాల్ (137) పరుగులతో సెంచరీ సాధించాడు. 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వెస్టిండిస్ జట్టుని కోర్ట్నీ వాల్స్ 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి 37 పరుగులతో ఆదుకున్నాడు. దీంతో విండిస్ 298 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దొడ్డ గణేష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా సచిన్ టెండూల్కర్(92), రాహుల్ ద్రవిడ్(78) పరుగులతో రాణించి 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 243 బంతులను ఎదుర్కొనడం విశేషం. ఈ స్కోరుని చూసి టీమిండియా భారీ స్కోరు చేస్తుందని భావించారు.

319 పరుగులకే టీమిండియా ఆలౌట్
273/4 పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా రాహుల్ ద్రవిడ్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటైంది. 46 పరుగుల వ్యవధిలో మిగితా 6 వికెట్లు కోల్పోయింది. వెస్టిండిస్ బౌలర్లలో ఫ్రాంక్లిన్ రోజ్ నాలుగు వికెట్లు తీయగా ఇయాన్ బిషప్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక, రెండో ఇన్నింగ్స్లో వెస్టిండిస్ను 140 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియాకు 21 పరుగుల ఆధిక్యం లభించింది. విండిస్ జట్టులో బ్రియాన్ లారా 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆంబ్రోస్(18), మెర్విన్ డిల్లాన్(21)లతో కలిసి ఆఖరి వికెట్కు లారా 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

68 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన కురువిల్లా
భారత బౌలర్లలో పేసర్ అబే కురువిల్లా 68 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయగా... వెంకటేశ్ ప్రసాద్ మూడు, దొడ్డ గణేష్ రెండు వికెట్లు తీశారు. దీంతో ఈ టెస్టులో టీమిండియా విజయానికి 120 పరుగులు అవసరమయ్యాయి. నాలుగో రోజు ఆటలో భాగంగా ఓపెనర్లుగా వీవీఎస్ లక్ష్మణ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు క్రీజులోకి వచ్చారు. సాధించాల్సిన స్కోరు తక్కువ కావడంతో మైదానంలోని అభిమానులంతా టీమిండియానే విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, అలా జరగలేదు. సిద్ధు(3) పరుగులకే పెవిలియన్కు చేరగా... ఆ తర్వాత 21 బంతులాడిన రాహుల్ ద్రవిడ్(2) పరుగులకే ఔట్ కాగా.... అనంతరం సచిన్ టెండూల్కర్(4) పరుగులకే పెవిలియన్కు చేరాడు.

19 పరుగులు చేసిన లక్ష్మణ్ టాప్ స్కోరర్గా
వీవీఎస్ లక్ష్మణ్(19) ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. 36 ఓవర్లలోపే 81 పరుగులకే ఆలౌటైంది. దీంతో 38 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. విండిస్ బౌలర్లలో ఇయాన్ బిషప్ నాలుగు వికెట్లు తీయగా... ఆంబ్రోస్, రోస్ చెరో మూడు వికెట్లు తీశారు. విండిస్ బ్యాట్స్మన్ చందర్ పాల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమి భారత అభిమానులను కొన్ని ఏళ్ల పాటు బాధించింది. సచిన్ టెండూల్కర్ అయితే ఈ ఓటమిపై ఎన్నో సార్లు అభిమానులను క్షమాపణలో కోరాడు. ఈ విజయమే విండిస్ను ఆ పర్యటనలో విజేతగా నిలిపింది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను వెస్టిండిస్ 1-0తో గెలుచుకుంది.


Click it and Unblock the Notifications
