
హైదరాబాద్: చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ విజయంతో 18 పాయింట్లతో సీఎస్కే టేబుల్ టాపర్గా నిలిచింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరోవైపు 16 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానానికి పడిపోయింది. సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
అనంతరం సీఎస్కే బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(4/12), రవీంద్ర జడేజా(3/9) అద్భుత ప్రదర్శన చేయడంతో ఢిల్లీ చిత్తుగా ఓడింది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 31 బంతుల్లో44(4ఫోర్లు, 1 సిక్సర్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ధావన్(19) పరుగులతో ఫరవాలేదనిపించాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అయితే, మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో ఓ అద్భుతమైన మూమెంట్ క్రికెట్ అభిమానులను కనువిందు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు సౌవర్ గంగూలీని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.