
ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది:
ఇదివరకే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కలిపి అయిదేళ్ల మూడు నెలలు పనిచేసిన సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆరు నెలలు పూర్తి చేసుకున్నాడు. ఇక గంగూలీ కొనసాగడానికి వీలున్నది ఇంకో మూడు నెలలు మాత్రమే. అయితే పదవీ కాలం విషయంపై రాజ్యాంగాన్ని సవరించాల్సిందిగా కోరుతూ గంగూలీ బృందం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై దాదా స్పందిస్తూ... 'ప్రస్తుతం కోర్టులు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. కాబట్టి ఆ విషయంపై ఎలాంటి తాజా సమాచారం లేదు. అయినా ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది. అది మా చేతుల్లో లేదు' అని పేర్కొన్నాడు.

ఏం చెప్పమంటారు:
దాదా ఐపీఎల్ 2020 గురించి స్పందిస్తూ... 'ప్రస్తుత స్థితిలో ఐపీఎల్పై ఏం చెప్పమంటారు. ఐపీఎల్ను పక్కన బెట్టండి. ప్రపంచం మొత్తమే స్తంభించిపోయిన వేళలో ఎక్కడా ఏ రకమైన క్రీడలూ జరగడం లేదు. పరిస్థితులేమైనా మెరుగుపడతాయేమోనని మేం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. కానీ.. ఏమీ మారడంలేదు. చెప్పడానికీ ఏమీ లేదు. ఎవరూ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఇక ఆటగాళ్లెలా బయటికి వస్తారు, ఎలా ప్రయాణిస్తారు' అని అన్నాడు.

ఈ పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదు:
నా 46 ఏళ్ల జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. బహుశా ప్రపంచం కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూడలేదనుకుంటా. ఇప్పుడు అందరి బాధ ఒకటే.. వచ్చే రెండు వారాల్లో మృతులెందరనే!. ఈ దుస్థితి ఇంకెప్పుడూ రాకూడదని ప్రార్థిస్తున్నా. ఇక నా నుంచి ప్రత్యేక సందేశమంటూ వేరే లేదు. మీ వాళ్ల కోసం, మీ చుట్టూ ఉండే జనం కోసం మీరు సహనంతో ఉండండి. ఇంట్లోనే ఉండండి' అని గంగూలీ సూచించాడు.

కుటుంబంతో ఇంట్లో ఉన్నా:
'లాక్డౌన్ అంటే లాక్డౌనేగా. నేను నా కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి అవకాశమైతే ఉండదు. ఇప్పుడైతే ఉండాల్సి వచ్చింది. నేను కాసేపు బీసీసీఐ పనులు చక్కబెడుతున్నా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వ్యవహారాలు చూస్తున్నా. తీరిక దొరికినపుడల్లా టీవీల్లో తాజా పరిస్థితుల్ని తెలుసుకుంటున్నా. ఇంట్లో ఉన్న జిమ్లో చెమటోడ్చుతున్నా. ప్రస్తుతం ఇదే నా దినచర్య' అని దాదా చెప్పాడు.


Click it and Unblock the Notifications












