హైదరాబాద్: భారత స్టార్ బ్యాట్స్మన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ జట్టులోని ఓ యువ క్రికెటర్కు వినూత్నమైన బహుమతిని అందజేశాడు. ఇంతకీ ఈ ఆటగాడు ఎవరో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ జట్టు సభ్యుడు సర్ఫరాజ్ ఖాన్.
బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లి జట్టులో సహచర బ్యాట్స్మన్ సర్ఫరాజ్కు బ్యాట్, ఒక జత గ్లోవ్స్ను బహుమతిగా ఇచ్చాడు. సర్ఫరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 సీజన్లో బెంగళూరు తరపున ఆడిన విషయం తెలిసిందే.
అయితే, ఫిట్నెస్ లేకపోవడంతో లీగ్లో ఐదు మ్యాచ్లు ఆడి కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు సర్ఫరాజ్. అంతేగాక, ఫీల్డింగ్లో కూడా అంతంగా చురుకుగా లేకపోవడంతో టోర్నీ నుంచి పక్కనపెట్టేశారు.

కాగా, ఈ ఏడాది సియట్ 'యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా సర్ఫరాజ్ఖాన్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కోహ్లీ తనకు బహుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించాడు.
అవి తనకు బ్యాట్, గ్లోవ్స్ కాదు.. బాణం, విల్లు అని చెప్పుకొచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. జట్టులో చోటు దక్కించుకునేందుకు మరింతగా శ్రమ పడాలని కోహ్లీ సూచించాడని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే తాను మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. కాగా, ఈ 18 ఏళ్ల భారత యువ క్రికెటర్ ఈ మధ్య బంగ్లాదేశ్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో 355 పరుగులు చేసి టోర్నీలో రెండో స్థానంలో నిలిచాడు.