టీ20 వరల్డ్ కప్కు ప్రకటించిన భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్గా సంజు శాంసన్ చోటు దక్కించుకున్నాడు. తొమ్మిదేళ్ల క్రితమే టీమిండియా తరఫున అరంగేట్రం చేసినప్పటికీ శాంసన్కు గొప్ప అవకాశాలు ఎక్కువగా రాలేదు. జట్టులో తన స్థానం సుస్థిరంగా ఎప్పుడూ లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచకప్కు ఎంపికయ్యాడు.
అయితే శాంసన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిలో శాంసన్ కొన్ని కీలక విషయాలు చెప్పాడు. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చెప్పిన ఓ అబద్ధం తన కెరీర్ను ఎలా మార్చిందో వివరించాడు. ఆ అబద్ధం కారణంగా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చానని, ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కిందని శాంసన్ పేర్కొన్నాడు.

''కేకేఆర్తో ఉన్నప్పుడు నేను ఇతర విషయాలు ఆలోచించలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఉన్నప్పుడు ఓ హోటల్లో రాహుల్ ద్రవిడ్తో శ్రీశాంత్ నా గురించి మాట్లాడాడు. అప్పుడు ఆర్ఆర్కు ద్రవిడ్ సారథ్యం వహిస్తున్నాడు. నన్ను చూపిస్తూ.. 'అతను సంజు శాంసన్. మంచి బ్యాటర్. కేరళకు చెందిన కుర్రాడు. స్థానిక టోర్నమెంట్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. మనం అతనికి కచ్చితంగా ఓ ట్రయిల్ నిర్వహించాలి' అని ద్రవిడ్తో శ్రీశాంత్ చెప్పాడు''
''దానికి ద్రవిడ్.. 'అవునా సరే, ట్రయిల్స్కు తీసుకురండి. అతనికి ఛాన్స్ ఇద్దాం' సానుకూలంగా స్పందించాడు. అయితే నేను ఆరు సిక్సర్లు కొట్టానని శ్రీశాంత్ చెప్పింది అబద్ధం'' అని శాంసన్ పేర్కొన్నాడు. కాగా, 2012లో సంజు శాంసన్ను కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది. అయితే ఆ సీజన్లో అతని ఒక్క అవకాశం కూడా రాలేదు. తర్వాత శాంసన్ను కేకేఆర్ విడిచిపెట్టింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్కు వచ్చిన శాంసన్ ఇప్పుడు అదే జట్టును నడిపిస్తున్నాడు. సారథిగా, బ్యాటర్గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఐపీఎల్-2024లో ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదింట్లో గెలిచి 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ ప్లేఆఫ్స్కు చేరడం దాదాపు ఖాయమే. కాగా,ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శాంసన్ పదో స్థానంలో ఉన్నాడు. 64 సగటుతో 385 పరుగులు చేశాడు.