

నాటింగ్హామ్: భారత జట్టులోకి ఎవరూ ఊహించనంతగా చిన్న వయస్సులోనే 18ఏళ్ల కుర్రాడు అరంగ్రేటం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లాండ్తో త్వరలో జరగనున్న నాలుగు, ఐదో టెస్టు కోసం భారత సెలక్టర్లు బుధవారం ప్రకటించిన జట్టులో పృథ్వీషా చోటు సంపాదించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. 18 ఏళ్ల పృథ్వీషాని జట్టులోకి ఎంపిక చేశారు.
కానీ.. పదేళ్ల కిందటే ఈ కుర్రాడు తన ఆటతో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని మెప్పించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెరీర్లో 14 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడి 1,418 పరుగులు చేసిన పృథ్వీషా.. భారత్-ఎ తరఫున ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనే 406 పరుగులు చేయడం అతని నిలకడకి నిదర్శనం. భారత టెస్టు జట్టులోకి పృథ్వీషా ఎంపికవడంపై తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడాడు.
'దాదాపు పదేళ్ల కిందట.. నా స్నేహితుడు జగదీశ్ నా దగ్గరకి వచ్చి పృధ్వీషా గురించి చెప్తూ.. ఆ కుర్రాడి బ్యాటింగ్ మెరుగయ్యేందుకు సాయం చేయమని అడిగాడు. దీంతో.. నేను ఒక సెషన్ పృధ్వీషాతో ప్రాక్టీస్ చేయించి రెండు మూడు సూచనలు చేశాను. ఆ సమయంలో అతను బ్యాట్ పట్టుకునే విధానం, తీసుకున్న స్టాన్స్ను పరిశీలించి.. ఎట్టిపరిస్థితుల్లో ఇక స్టాన్స్ మార్చుకోవద్దని సూచించాను.'
'అంతేకాదు సెషన్లో అతని ఆటను కాసేపు చూసిన తర్వాత.. ఈ కుర్రాడు తప్పకుండా భారత జట్టుకి ఆడతాడని నా స్నేహితుడితో అప్పుడే చెప్పా. ఆఖర్లో మరోసారి స్టాన్స్ మార్చుకోవద్దని పృథ్వీషాకి సూచించి.. ఎవరైనా బలవంతం చేస్తే నాకు చెప్పమని అన్నాను' అని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. గాడ్ ఆఫ్ క్రికెట్ ఆదేశిస్తే ఇంకెందుకు మార్చుకుంటాడు.