

హైదరాబాద్: టీమిండియాతో టెస్టు సిరీస్ పురస్కరించుకుని ఇంగ్లాండ్ జట్టంతా విరాట్ కోహ్లీనే టార్గెట్ చేసింది. కోహ్లీని అవుట్ చేస్తే దాదాపు భారత్ స్కోరును అదుపుచేసినట్లే అని భావించింది. ఇదే క్రమంలో.. టీమిండియా కూడా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ను అవుట్ చేసేందుకు శత విధాలా పోరాడింది. జో రూట్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి చేసిన ప్రయత్నాలలో తానంతట తానే చేసిన తప్పిదం జో రూట్ కొంపముంచింది. కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్కు చేరాడు.
ఈ వికెట్ పడిన అనంతరం కోహ్లీ సంబరాల్లో మునిగిపోయాడు. అది కూడా అంతకుముందు జో రూట్ చేసిన విన్యాసమే కావడంతో.. నెటిజన్లంతా కోహ్లీ కావాలనే అలా చేసి చూపాడు. మ్యాచ్ మొత్తంలో విరాట్ కోహ్లి ఈ 'మైక్ డ్రాప్' ఘటనే హైలెట్గా నిలిచింది. అద్భుతమైన త్రో విసిరి రూట్ను రనౌట్ చేసిన కోహ్లి సంబరాలు చేసుకున్నాడు.
మూడో వన్డేలో అజేయ సెంచరీతో ఇంగ్లాండ్ను గెలిపించిన అనంతరం రూట్ ఈ మైక్ డ్రాప్కి నాంది పలకగా.. అతణ్ని రనౌట్ చేసిన కోహ్లి రివేంజ్ తీర్చుకున్నాడు. రూట్ రనౌటయ్యాక మ్యాచ్ మలుపు తిరిగింది. 216/3తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
ఇంతకూ ఈ మైక్ డ్రాప్కి అర్థమేంటి? అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. సాధారణంగా స్పీచ్ లేదా ప్రదర్శన ముగిసిన తర్వాత విజయానికి చిహ్నంగా మైక్ను చేతుల్లో నుంచి కిందికి జారవిడుస్తారు. ఘన విజయానికి సంకేతంగా లేదా మరెవరూ అధిగమించడానికి, చేయడానికి సాధ్యం కాదనే ఉద్దేశాన్ని బహిర్గతం చేయడానికి ఇలా చేస్తారు.