తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులను భయపెట్టే ప్లేయర్ అతడు, జట్టును గెలిపించగలిగే ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న ఆటగాడు అతడు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ అతడు, బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టాప్ బ్యాటర్స్ కోహ్లీ, రోహిత్ విఫలమైనా తన బ్యాట్తో మంచిగా రాణించాడతడు. అలాంటి అద్భుత ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్ కు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అవకాశం ఇవ్వకపోవడం, బెంచ్ కే పరిమితం చెయ్యడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. అతడే భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్.
ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో టైటిల్ పోరులో న్యూజిలాండ్ తో తలపడనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందనే విషయం కాసేపు పక్కనపెడితే.. క్రికెట్ అభిమానులంతా చర్చల్లా రిషభ్ పంత్ గురించే ఎక్కువ సాగుతోంది. అసలు అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నఅభిమానుల మనసులో తెగ తిరుగుతోంది. పోనిలే ఏదో ఒక్క మ్యాచ్ కే తీసుకోలేదు కదా అని అనుకోవడానికి లేదు. సెమీస్ కూడా అయిపోయింది, ఇక మిగిలిందల్లా ఫైనల్ ఒక్కటే. కనీసం అందులోనైనా పంత్ ను ఆడిస్తారా లేదా అనేది ప్రస్తుతం అభిమానుల్లో అనుమానంగానే ఉంది.

కేఎల్ రాహుల్ వర్సెస్ పంత్..
వాస్తవానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్ వర్సెస్ పంత్ పోటీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరిలో ఒకరినే తీసుకునే అవకాశం ఉండడంతో స్క్వాడ్ సెలక్షన్ విషయమై గంభీర్ - అజిత్ అగార్కర్ మధ్య మనస్పర్థలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా గంభీర్.. కాంబినేషన్స్ నేపథ్యంలో కేఎల్ రాహులే నెం.1 వికెట్ కీపర్ అంటూ అతడికే అవకాశం కల్పించాడు. అన్నీ మ్యాచుల్లోనూ అతడితోనే ఆడించాడు. పంత్ కు కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మరి అన్ని మ్యాచులు ఆడిన కేఎల్ రాహుల్.. అంచనాలకు తగ్గట్టుగా ఆడాడా అంటే పర్వాలేదనిపించాడనే చెప్పాలి. కానీ అభిమానులు, పలువురు మాజీలు మాత్రం పంత్ ను తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడనివ్వకుండా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఐపీఎల్ 2025 సీజన్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అతడిని రూ. 27 కోట్లకు లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.