టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోకపోవడం అభిమానులనే కాకుండా అతని కుటుంబాన్ని కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్ తన ఆవేదనను పంచుకున్నారు. భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి తన కొడుకు ఇంకా ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
శ్రేయస్ అయ్యర్ తండ్రి ఆవేదన
"ప్రతి సంవత్సరం ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. శ్రేయస్ కెప్టెన్గా ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ వంటి మూడు జట్లను ఫైనల్స్ వరకు నడిపించాడు. అంతేకాకుండా కోల్కతాకు ఛాంపియన్ టైటిల్ను కూడా అందించాడు" అని సంతోష్ అయ్యర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను శ్రేయస్ను భారత జట్టుకు కెప్టెన్గా చేయమని అడగడం లేదని.. కనీసం జట్టులో ఎందుకు తీసుకోలేదో మాత్రమేనని అడుగుతున్నానన్నారు. అయితే భారత జట్టులో స్థానం లభించకపోవడం గురించి శ్రేయస్ పెద్దగా పట్టించుకోలేదని.. అతని ముఖంలో ఎలాంటి స్పందన లేదని ఆయన చెప్పారు.

తగినంత అదృష్టం లేదని చెప్పి శ్రేయస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. జట్టులో చోటు లభించనప్పుడు ఏమీ చేయలేమని.. నిశ్శబ్ధంగా ఉండి అవకాశం కోసం ఎదురు చూడాలని శ్రేయస్ అన్నట్లుగా సంతోష్ వివరించారు. శ్రేయస్ ఎవరినీ నిందించడానికి ఇష్టపడలేదు, కానీ అతనిలో తీవ్ర నిరాశ ఉందని తండ్రి తెలిపారు.
అభిషేక్ నాయర్ ప్రశ్న
శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు టీమిండియా తరపున 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 1104 పరుగులు చేశాడు. శ్రేయస్ సగటు 30, స్ట్రైక్ రేట్ 136గా ఉన్నాయి. శ్రేయస్ జట్టులో లేకపోవడంపై, మాజీ క్రికెటర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ప్రశ్నించారు. శ్రేయస్ అయ్యర్ను కనీసం రిజర్వ్ జట్టులో కూడా ఎందుకు చేర్చలేదని ఆయన నిలదీశారు.